Sanju Samson Reacts On Placement In Team India: ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టీ20 వరల్డ్కప్ భారత జట్టులో యువ ఆటగాడు సంజూ శాంసన్కి చోటు దక్కకపోవడంపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో అందరికీ తెలుసు! టాలెంట్ ఉన్నప్పటికీ, అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇతరులు వరుసగా విఫలం అవుతున్నా ఛాన్సులు ఇస్తున్నారని, కానీ సంజూకి అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా దారుణమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. భారత జట్టులో అంత సులువుగా చోటు దక్కదని, అది చాలా సవాళ్లతో కూడుకున్న పని అని అతడు చెప్పాడు.
‘‘టీమిండియాలో చోటు దక్కడమన్నది చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆ విషయంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడున్న జట్టులోని ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం దక్కాలంటే.. పోటీ తప్పదు. ఇలాంటప్పుడు నేను నా ఆటపై పూర్తి దృష్టి పెట్టడమే చాలా ముఖ్యం. అలాగే సవాళ్లని కూడా ఎదుర్కొంటూ ఉండాలి. ప్రతీసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తేనే.. అవకాశాలు వస్తాయి’’ అని సంజూ సమాధానమిచ్చాడు. అలాంటే బ్యాటింగ్ స్థానాలపై స్పందిస్తూ.. ‘‘బ్యాటర్లను ఒక్క స్థానానికే పరిమితం చేయకూడదు. గత మూడు, నాలుగేళ్ల నుంచి నేను వేర్వేరు స్థానాల్లో ఆడుతుండడంతో.. నా ఆటలో కొత్త కోనం వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఆర్డర్లో అయినా ఆడగలనని విశ్వాసంతో ఉన్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం సంజూ భారత్ ‘ఏ’ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం చెన్నైలో ఈ జట్టు న్యూజీలాండ్ ‘ఏ’ జట్టుతో తలపడనుంది.
