Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!

  • భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్‌లో పెద్ద వివాదం
  • శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవ
  • వైభవ్ మంచి బాలుడు అంటున్న బహుతులే
Vaibhav Sooryavanshi Controversy

Vaibhav Sooryavanshi Controversy

Sairaj Bahutule defended Vaibhav Sooryavanshi: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం పెద్ద వివాదమే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గొడవకు వెళ్ళాడు. ఈ వివాదంపై భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. వైభవ్‌ చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరైనా అతడిని అదే పనిగా రెచ్చగొట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మైదానంలో ఎలా ప్రవర్తించాలో శ్రీలంక ఆటగాళ్లకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బహుతులే వ్యాఖ్యానించారు.

దురదృష్టకరమైన సంఘటన:

సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం వరకు పరిస్థితి వెళ్లింది. పక్కనే ఉన్న ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన సాయిరాజ్ బహుతులే.. ‘ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. వైభవ్‌ను ఎంతవరకు రెచ్చగొట్టారో మనకు పూర్తిగా తెలియదు. నాకు తెలిసినంత వరకు వైభవ్ చాలా ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉండే బాలుడు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం’ అని అన్నారు.

×
×
Ad

వైభవ్‌కు సరైన మార్గనిర్దేశం చేస్తాం:

వైభవ్ చిన్న వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, అతనిపై పెద్ద బాధ్యతలు ఉన్నాయని బహుతులే గుర్తుచేశారు. ‘వైభవ్‌కు అవసరమైన సూచనలు తప్పకుండా అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాట్లాడతాం. అతడు యువ ఆటగాడు.. ఈ ఘటన నుంచి నేర్చుకుంటాడు. కేవలం భారత ఆటగాళ్లకే కాదు, శ్రీలంక ఆటగాళ్లకు కూడా మైదానంలో ప్రవర్తనపై అవగాహన కల్పించాలి. మైదానంలో ఎలా ప్రవర్తించాలో శ్రీలంక ఆటగాళ్లకు చెప్పాలి. అదే విధంగా మన ఆటగాళ్లకూ ఈ విషయాలు వర్తిస్తాయి. ఇలాంటి సంఘటనలను సులభంగా నివారించవచ్చు. ఇరు జట్ల కోచ్‌లు, సీనియర్ సభ్యులు ఈ విషయాల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలి’ అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఘటన:

సూపర్ ఓవర్ ఓటమి అనంతరం వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జేలను శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విశెన్ హలంబగే చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన వైభవ్.. ఘాటుగా స్పందించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది వైభవ్ ప్రవర్తనను తప్పుబట్టగా.. మరికొందరు అతడిని ముందుగా రెచ్చగొట్టారని, అందుకే స్పందించాడని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపై భారత కోచ్ సాయిరాజ్ బహుతులే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.