Sai Sudharsan Not To Travel Sri Lanka: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు మంగళవారం కొలంబో చేరుకుంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ప్లేయర్స్, సహాయక సిబ్బందితో పాటు నలుగురు నెట్ బౌలర్లు కూడా జట్టుతో కలిసి శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అయితే కొలంబో చేరుకున్న భారత జట్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో కూడా సాయి ఎక్కడా కనిపించకపోవడం విశేషం.
ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టెస్టు జట్టులో సాయి సుదర్శన్కు చోటు దక్కింది. అయితే అతడు ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేస్తేనే తుది జట్టులో ఉంటాడని వెల్లడించింది. స్వల్ప గాయంతో బాధపడుతున్న సుదర్శన్.. మంగళవారం భారత జట్టుతో కలిసి కొలంబో వెళ్లలేదని తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా పాదానికి అయిన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదట. తొలి టెస్టు ప్రారంభానికి ఇంకా 11 రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో సుదర్శన్ ఆడతాడా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.ఒకవేళ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయకుంటే తొలి టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సాయి సుదర్శన్ తుది జట్టుకు అందుబాటులో లేకపోతే.. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్కు అవకాశం దక్కనుంది. శ్రీలంక-ఏతో జరిగిన ఇండియా-ఏ మ్యాచ్ల్లో పడిక్కల్ 67, 94 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత జట్టుకు ఇప్పటికే మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మొత్తం టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో జమ్మూ కశ్మీర్కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని బీసీసీఐ ఎంపిక చేసింది. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్ల్లో 104 వికెట్లు పడగొట్టిన నబీ.. 2025-26 సీజన్లో ఒక్కదానిలోనే 60 వికెట్లు తీసి జమ్మూ కశ్మీర్కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుథార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.

