NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ.. మూడేళ్ల ఎదురుచూపులకు చెక్

Rohit1

Rohit1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ క్రమంలోనే మూడేళ్ల ఎదురుచూపులకు చెక్ పెడుతూ కెప్టెన్‌ రోహిత్ (101) వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియా మీద చివరిసారిగా రోహిత్‌ మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఇప్పుడు సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ సెంచరీ చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్‌లో రోహిత్‌కిది 30వ శతకం. సెంచరీ చేసిన కాసేపటికే బ్రేస్‌వెల్ వేసిన 27వ ఓవర్లో హిట్‌మ్యాన్ ఔటై పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112) కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన గిల్‌.. నేటి మ్యూచ్‌లోనూ సెంచరీ పూర్తి చేశాడు. గిల్‌ కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో శతకం బాదడం విశేషం. అనంతరం కోహ్లీ (36) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ (14) నిరాశపర్చడంతో టీమిండియా ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.

Pawan Kalyan: బీజేపీతోనే ఉన్నా.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా

ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదిన రోహిత్.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30)తో కలిసి సమంగా మూడో స్థానంలో నిలిచాడు. అలాగే గిల్, రోహిత్ కలిసి 212 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అలాగే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు వన్డే శతకాలు బాదిన ఐదో క్రికెటర్‌, టీమిండియా నుంచి తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్ ఘనత సాధించాడు. 21 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు బాదాడు. పాక్‌ బ్యాటర్ ఇమామ్‌ ఉల్ హక్‌ కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గానూ గిల్ రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు సాధించాడు. బాబర్‌ అజామ్ (360)తో సమంగా నిలిచాడు.