Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి

  • అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్
  • ఉత్తరాఖండ్‌లో భూమి కోసం మూడేళ్లుగా ప్రయత్నం
  • పంత్‌కు సీఎం ధామి హామీ
Rishabh Pant

Rishabh Pant

టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అర్ధరాత్రి సమయంలో ‘X’లో పంత్ చేసిన పోస్టులకు సీఎం ధామి స్పందించి, సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని, నిబంధనల ప్రకారం సాధ్యమైనంత సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌లో భూమి కోసం మూడేళ్లుగా ప్రయత్నం

రిషబ్ పంత్ తన సోషల్ మీడియా పోస్టులో తాను చాలా కాలంగా ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే తనకు నచ్చిన విధంగా నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సరైన, విశాలమైన స్థలం దొరకడం లేదని చెప్పారు. తాను ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లి అక్కడే నివసించాలని కోరుకుంటున్నట్లు పంత్ వెల్లడించాడు. తనకు ఉత్తరాఖండ్ అంటే ఎంతో ప్రేమ అని, రాష్ట్రంలోని కొండ ప్రాంత ప్రజలతో కలిసి అక్కడ స్థిరపడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భూమి కోసం దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అనుకున్న స్థలం దొరకలేదని పంత్ తెలిపాడు. ఈ విషయంలో సీఎం ధామి సహాయం చేయాలని కోరాడు.

‘ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేయడానికి సిద్ధం’

తన మరో పోస్టులో పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించినందుకు తన రాష్ట్రం నుంచి బహుమతిగా భూమి లభిస్తే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేయాల్సి వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. “కనీసం నా రాష్ట్రంలోనైనా నాకు ఒక ఇల్లు ఉంటుంది” అనే ఉద్దేశంతో పంత్ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

పంత్‌కు సీఎం ధామి హామీ

రిషబ్ పంత్ చేసిన పోస్టులను గమనించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెంటనే స్పందించారు. పంత్ ఉత్తరాఖండ్‌కు గర్వకారణమని ధామి పేర్కొన్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్తరాఖండ్‌కు మంచి పేరు తీసుకొచ్చాడని ప్రశంసించారు. తన మాతృభూమిపై పంత్‌కు ఉన్న ప్రేమ, తిరిగి ఉత్తరాఖండ్‌కు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సేవ చేయాలనే కోరిక అభినందనీయమని సీఎం తెలిపారు. పంత్ లేవనెత్తిన అంశంపై సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని ధామి వెల్లడించారు. అధికారులు త్వరలో పంత్‌ను సంప్రదించి, నిబంధనలకు అనుగుణంగా సాధ్యమైనంత సహకారం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌తో పంత్‌కు ప్రత్యేక అనుబంధం

రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌తో తన అనుబంధాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగినప్పటికీ తన స్వరాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో కాకుండా ఉత్తరాఖండ్‌లోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి ప్రజలతో కలిసి జీవించాలని పంత్ కోరుకుంటున్నట్లు తాజా పోస్టుల ద్వారా స్పష్టమైంది.