FIFA World Cup 2026: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిఫా వరల్డ్ కప్కు కూడా చేరాయి. టోర్నలో పాల్గొంటున్న ఇరాన్ ఫుట్బాల్ం జట్టుకు తీవ్ర అవమానం ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ అనంతరం, వెంటనే అమెరికా విడిచి మెక్సికోలోని శిక్షణా శిబిరానికి తిరిగి వెళ్లాలని అమెరికా ఇరాన్ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాస్ ఏంజెల్స్లో సోఫై స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. సాధారణంగా మ్యాచ్ జరిగిన తర్వాత ప్లేయర్లు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ అమెరికా అధికారులు ఇరాన్ జట్టును వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. తమకు కనీస సమయం కూడా ఇవ్వకుండా వెంటనే మెక్సికోలోని టిజువానాకు వెళ్లాలని సూచించినట్లు కోచ్ చెప్పారు. మాకు కనీసం కోలుకునే సమయం కూడా ఇవ్వలేదని, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని అన్నారు. ఈ వరల్డ్ కప్లో అత్యంత అణచివేతకు గురైన జట్టు మాదే అని కోచ్ వ్యాక్యానించారు. తమ జట్టుకు సంబంధించిన అనేక నిర్ణయాలు వేరే వాళ్లు తీసుకుంటున్నారని అన్నారు.
ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తారెమీ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ జట్టులో చాలా మందికి అమెరికా వీసాలు కూడా లభించలేదని చెప్పారు. ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు, కోచింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు సహా పలువురు కీలక సభ్యులు జట్టుతో చేరలేకపోయారని వెల్లడించారు. ఇరాన్, అమెరికా ఉద్రికత్ పరిస్థితుల నేపథ్యంలో తమ గ్రూప్ దశ మ్యాచ్లను అమెరికా వెలుపల నిర్వహించాలని ఫిఫాను కోరినప్పటికీ, ఇరాన్ అభ్యర్థనకు ఆమోదం దొరకలేదు.

