Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!

  • మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన రాహుల్ సమిత్
  • క్లాసిక్ కవర్ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్ కట్ షాట్లు
  • మైదానం నలుమూలలా 360 డిగ్రీ బ్యాటింగ్
Samit Dravid

Samit Dravid

Samit Dravid Stuns with 360-Degree Batting: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీ20 ట్రోఫీలో భాగంగా బుధవారం హుబ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సమిత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాసిక్ కవర్ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్ కట్ షాట్లు, పుల్ షాట్లతో పాటు మైదానం నలుమూలలా 360 డిగ్రీ బ్యాటింగ్ ప్రదర్శిస్తూ అభిమానులను అలరించాడు.

కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ తరఫున బరిలోకి దిగిన 20 ఏళ్ల సమిత్ ద్రవిడ్.. హుబ్లీ టైగర్స్‌పై 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. రెండో వికెట్‌కు రోహన్ పాటిల్‌తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. సమిత్ బ్యాటింగ్‌లో అతని తండ్రి రాహుల్ ద్రవిడ్ శైలి కనిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. సమిత్ బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాసికల్ టెక్నిక్‌కు ఆధునిక టీ20 షాట్లను జోడిస్తూ ఆకట్టుకుంటున్న సమిత్.. భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహన్ పాటిల్ 38 బంతుల్లో 64 పరుగులు, ప్రవీణ్ దూబే 28 బంతుల్లో 51 పరుగులతో అర్ధశతకాలు నమోదు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించారు. చివర్లో శివరాజ్ ఏడు బంతుల్లో 23 పరుగులు చేశాడు. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హుబ్లీ టైగర్స్ చివరి బంతి వరకు పోరాడింది. అనీశ్వర్ గౌతమ్ (34), శివకుమార్ రక్షిత్ (41), మన్వంత్ కుమార్ 22 బంతుల్లో 60 పరుగులతో మెరుపులు మెరిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో హుబ్లీ టైగర్స్ 7 వికెట్లకు 201 పరుగులకే పరిమితమై రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో నిశ్చిత్ రావు 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించగా.. విద్వత్ కావేరప్ప రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బెంగళూరు బ్లాస్టర్స్ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరో విజయాన్ని నమోదు చేసి.. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.