ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆరంభ మ్యాచ్లో విజయం సాధించింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ ఛేదించింది. మయాంక్, ధావన్, రాజపక్స, లివింగ్ స్టోన్, ఒడియాన్ స్మిత్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అయితే బెయిర్స్టో అందుబాటులోకి రావడంతో లివింగ్ స్టోన్ను పక్కన పెడతారా లేదా రాజపక్సను తప్పిస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అందుబాటులోకి వచ్చాడు. అటు ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కూడా రెండో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం అందుతోంది.