టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన అశ్విన్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎప్పటిలాగే తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఇంటికి పోలీసుల రాకతో యాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో ఈ ఘటనను వివరించాడు.
తాను వీడియో రికార్డ్ చేస్తుండగా ఇంటి సెక్యూరిటీ గార్డు వరుసగా మూడు, నాలుగు సార్లు ఫోన్ చేశాడని ఆర్ అశ్విన్ చెప్పాడు. ‘నా ఇంటి సెక్యూరిటీ గార్డు మూడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు. అతడు సాధారణంగా ఇన్ని సార్లు కాల్ చేయడు. నేను వీడియో రికార్డింగ్లో బిజీగా ఉండటంతో వాటిని పట్టించుకోలేదు. అదే సమయంలో నా సతీమణి కూడా ఫోన్ చేయడంతో విషయం ఏదో ముఖ్యమైనదేనని అనుమానం వచ్చింది. నా భార్యకు తిరిగి ఫోన్ చేయగా.. ఇంటి తలుపు దగ్గర పోలీసు ఉన్నారు అని చెప్పింది. దీంతో నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. వెళ్లి చూస్తే నా పాస్పోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. నేను వీసా కోసం పాస్పోర్ట్ను సమర్పించా, అదే తిరిగి ఇచ్చేందుకు ఓ పోలీస్ అధికారి వచ్చారు’ అని వివరించాడు.
మీలాంటి ప్రముఖ క్రికెటర్కి కూడా ఇలాంటి సాధారణ ఘటనలు జరుగుతాయా? అని ప్రశ్నించగా.. ఆర్ అశ్విన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నేను ఒక సాధారణ వ్యక్తిలా జీవించాలనుకుంటాను. అందుకే సాధారణ జీవితాన్నే ఇష్టపడతాను’ అని పేర్కొన్నాడు. స్టార్ క్రికెటర్గా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో సాధారణతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. అశ్విన్ 2024 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత 2025లో ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో 287 మ్యాచ్ల్లో 765 వికెట్లు పడగొట్టాడు.
భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆర్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. భారత జట్టు తరఫున 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లోనూ అశ్విన్ భాగస్వామిగా ఉన్నాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత తన అనుభవాన్ని విశ్లేషణ, యూట్యూబ్ కార్యక్రమాల ద్వారా అభిమానులతో యాష్ పంచుకుంటున్నాడు.

