Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!

  • వైభవ్ సూర్యవంశీకి దక్కని అవకాశం
  • బీసీసీఐపై మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి
  • అదే లాజిక్‌ను ప్రతిసారి పాటించాలి కదా?
Vaibhav Sooryavanshi Bcci

Vaibhav Sooryavanshi Bcci

Mohammad Kaif questions BCCI over Vaibhav Sooryavanshi Snub: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఐపీఎల్ 2026, భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన చేసినా.. బుడ్డోడికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందంటూ.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్‌పై విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన జట్టును కొనసాగిస్తున్నామని అప్పుడు చెప్పిన వారు.. అదే సూత్రాన్ని అన్ని సందర్భాల్లో ఎందుకు పాటించలేదని కైఫ్ ప్రశ్నించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 776 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న బుడ్డోడు.. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ తుది జట్టులో అవకాశం రాలేదు. సిరీస్ ప్రారంభానికి ముందే బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్.. టీ20 ప్రపంచకప్ గెలిచిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ-సంజు శాంసన్‌లకే ప్రాధాన్యం ఇస్తామని, వైభవ్ తన అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

అయితే సిరీస్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. ఈ నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారిందని, ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోవడం దీనికి నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో కైఫ్ మాట్లాడుతూ.. ‘బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే అందులో వైభవ్ సూర్యవంశీ పేరు తప్పకుండా ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టునే కొనసాగిస్తున్నామని చెప్పి అతడిని పక్కన పెట్టారు. కానీ అదే లాజిక్‌ను ప్రతిసారి పాటించాలి కదా?’ అని ప్రశ్నించాడు.

మరో ఉదాహరణను కూడా మహ్మద్ కైఫ్ ప్రస్తావించాడు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ గెలిపించిన తర్వాత కూడా కెప్టెన్సీ నుంచి తప్పించి జట్టుకు దూరం చేశారు. అప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడిన వారు, ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?’ అంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌ను కైఫ్ నిలదీశాడు. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు కైఫ్ కూడా చేరాడు.