Mitchell Marsh Calls Australia’s Loss Embarrassing After Defeat vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు వరుస షాకులు తగులుతున్నాయి. గ్రూప్-బిలో జింబాబ్వే చేతిలో ఇప్పటికే దారుణ ఓటమిని మూటగట్టుకున్న ఆసీస్.. తాజాగా శ్రీలంక చేతిలోనూ ఓడిపోయింది. శ్రీలంకతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. లంక 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ ఓటమితో ఆసీస్ సూపర్ 8 అవకాశాలు సన్నగిల్లాయి. గ్రూప్-బిలో ఇప్పటికే లంక సూపర్ 8కే చేరుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్లలో ఓ విజయం సాధిస్తే జింబాబ్వే కూడా అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు దాదాపు దారులు మోసుకుపోయినట్లే.
శ్రీలంకపై మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఇది అవమానకర ఓటమి ఐ పేర్కొన్నాడు. ‘బ్యాటింగ్లో మాకు మంచి ఆరంభం దక్కింది. మొదటి అర్ధభాగం ముగిసే సరికి భారీ స్కోరు ఖాయం అందుకున్నాము. ఆరంభం బాగున్నప్పటికీ చివరి ఓవర్లలో బ్యాటింగ్లో విఫలమయ్యాం. సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాము. స్కోర్ బోర్డుపై మేం మరిన్ని పరుగులు ఉంచాల్సింది. లంక చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్పై పట్టుసాధించింది. భారీ స్కోర్లు చేయగల సామర్థ్యం తమ జట్టుకు ఉంది. కానీ.. ఈ మ్యాచ్లో ఆ స్థాయికి చేరుకోలేకపోయాము’ అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
Also Read: T20 World Cup 2026: గ్రూప్-బిలో తీవ్ర పోటీ.. సూపర్-8 బెర్త్ రేసులో జింబాబ్వే, ఆస్ట్రేలియా ఇంటికేనా?
‘ఇది అవమానకర ఓటమి. సూపర్ 8 అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఇప్పుడు మా భవితవ్యం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా జింబాబ్వే –ఐర్లాండ్ మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము. జింబాబ్వే గెలిస్తే మేము టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి జట్టును మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయాము’ అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రపంచకప్లో పరిస్థితులు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.
