Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!

  • తొలి టీ20లో మయాంక్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన
  • 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాచ్' అందుకున్న మయాంక్
  • కెరీర్‌లో అత్యంత కఠినమైన దశ గురించి మయాంక్ భావోద్వేగం
Mayank Yadav Injury Struggle

Mayank Yadav Injury Struggle

Mayank Yadav Opens Up on 2 Year Injury Struggle: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 18 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. 150 కిలోమీటర్లకు పైగా దూసుకొచ్చిన బంతులకు జింబాబ్వే బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాచ్’ అందుకున్న మయాంక్.. తన కెరీర్‌లో అత్యంత కఠినమైన దశ గురించి భావోద్వేగం చెందాడు. గాయాల కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మయాంక్.. ఆ కాలం తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయమని చెప్పాడు. ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా అని తెలిపాడు. దేశం తరఫున మళ్లీ ఆడాలనే కలే తనను ముందుకు నడిపించిందని మయాంక్ చెప్పుకొచ్చాడు.

మయాంక్ యాదవ్ 2024 అక్టోబర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన మయాంక్.. హరారే వేదికగా జింబాబ్వేపై అద్భుత వేగంతో బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘రెండేళ్ల పాటు భారత జట్టుకు దూరంగా ఉండటం చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి నా వయసు 22-23 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో వరుస గాయాలు, నిరాశలు ఎదుర్కోవడం మానసికంగా చాలా ప్రభావం చూపింది. ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా. కానీ ప్రతి క్రికెటర్‌ లాగే దేశం తరఫున ఆడాలనే కల చిన్నప్పటి నుంచే నాకు ఉండేది. అదే నన్ను మళ్లీ తిరిగి వచ్చేలా ప్రేరేపించింది’ అని తెలిపాడు.

జింబాబ్వే పరిస్థితులు తన బౌలింగ్‌కు బాగా అనుకూలించాయని మయాంక్ చెప్పాడు. ‘జింబాబ్వే పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని ముందే విన్నాను. హరారేలో ఇది నా తొలి మ్యాచ్. పిచ్ నుంచి మంచి బౌన్స్, వేగం లభించాయి. ఆ సహకారం వల్లనే జట్టు విజయానికి నా వంతు సహాయం చేయగలిగాను. శ్రేయస్ కెప్టెన్సీలో నేను తొలిసారి ఆడుతున్నాను. మ్యాచ్ మొత్తం బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు. నేను ఏ ప్లాన్‌తో బౌలింగ్ చేయాలనుకున్నానో దానికి పూర్తి మద్దతు ఇచ్చాడు. అవసరమైనప్పుడు మాత్రమే సలహాలు ఇచ్చాడు. అతడి నాయకత్వంలో చాలా స్వేచ్ఛగా బౌలింగ్ చేసిన అనుభూతి కలిగింది’ అని మయాంక్ తెలిపాడు.

తనతో పాటు బౌలింగ్ చేసిన అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్‌లతో మంచి సమన్వయం ఉందని మయాంక్ వెల్లడించాడు. ‘మేము వేగం గురించి పెద్దగా మాట్లాడుకోం. కానీ మైదానంలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటాం. నా తొలి ఓవర్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో గమనించిన తర్వాత ఆ విషయాలను అశోక్, ప్రిన్స్‌తో పంచుకున్నాను. ఒకరికి ఒకరం సూచనలు ఇచ్చుకుంటూ బౌలింగ్ చేయడం మాకు అలవాటే. వైభవ్ బ్యాటింగ్ అద్భుతం. ఐపీఎల్‌లో నేను అతడికి బౌలింగ్ చేసినప్పుడు ఆడిన కొన్ని షాట్లు చూసి ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసులో, ఇంత తక్కువ అనుభవంతో అలాంటి షాట్లు ఆడటం అసాధారణం. అతడు ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తాడు. ఇప్పుడు అతడితో ఒకే జట్టులో ఆడటం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై మయాంక్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. ’15 ఏళ్ల వయసులోనే అతడిలో ఉన్న ప్రతిభ అద్భుతం. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం చాలా అరుదు. అతడు ఇంకా చాలా దూరం వెళ్తాడు. జింబాబ్వేపై సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధ శతకం అతడికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గత సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయినా.. ఇప్పుడు దేశం తరఫున తొలి హాఫ్ సెంచరీ చేయడం వైభవ్ కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.