Kranti Gaud Fine: దుబాయ్లో జరిగిన ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు టైటిల్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కప్ గెలిచిన సంతోషంలో ఉన్న యువ పేసర్ క్రాంతి గౌడ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను క్రాంతి ఖాతాలో చేర్చింది. టీమిండియా పేసర్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది.
పెవిలియన్కు వెళ్లాలంటూ సైగలు:
ఆదివారం (సెప్టెంబర్ 13) ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. భారత్ నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమేషా దులానిని క్రాంతి గౌడ్ మొదటి ఓవర్లోనే అవుట్ చేసింది. క్రాంతి వేసిన తొలి బంతిని బౌండరీ బాదిన ఇమేషా.. మరో మూడు బంతుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో క్రాంతి సంబరాలు చేసుకుంటూ.. ఇమేషా వైపు చూస్తూ పెవిలియన్కు వెళ్లాలని చేయితో సైగలు చేసింది. ఇదే ఆమెపై జరిమానాకు కారణమైంది.
మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా:
ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.5 పరిధిలోకి వచ్చినట్లు ఐసీసీ పేర్కొంది. ఓ ప్లేయర్ ఔటైన సమయంలో అతడిని కించపరిచేలా లేదా ప్రత్యర్థి బ్యాటర్ నుంచి ప్రతిస్పందన వచ్చేలా భాష, చర్యలు లేదా సైగలను ఉపయోగించడాన్ని ఆర్టికల్ 2.5 కిందికి వస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో క్రాంతి గౌడ్కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను మ్యాచ్ రెఫరీ సుప్రియ రాణి దాస్ కేటాయించారు. మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన శిక్షను కూడా క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి. అంపైర్లు సలీమా ఇమ్తియాజ్, షతీరా జాకిర్ జెసీ, థర్డ్ అంపైర్ రోకేయా సుల్తానా, ఫోర్త్ అంపైర్ హుమైరా ఫరా కలిసి క్రాంతిపై అభియోగాలు నమోదు చేశారు.
అధికారిక మందలింపు తప్పనిసరి:
ఐసీసీ నిబంధనల ప్రకారం.. లెవల్-1 ఉల్లంఘనలకు కనీసం అధికారిక మందలింపు, గరిష్ఠంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. గత 24 నెలల్లో క్రాంతి గౌడ్కు ఇదే తొలి నేరం కావడంతో.. ఆమె రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే చేరింది. మరోవైపు పాకిస్థాన్ మహిళల జట్టుపైనా ఐసీసీ చర్యలు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ సెమీఫైనల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది. నిర్ణీత సమయంలో పాకిస్థాన్ ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు తేలడంతో ఈ జరిమానా విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ప్రతి ఓవర్ తక్కువైనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు.

