KL Rahul Goes Unsold in Maharaja Trophy T20 2026 Auction: భారత స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 2026 వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. శుక్రవారం (జూన్ 5) జరిగిన వేలంలో రాహుల్ అన్సోల్డ్గా మిగిలాడు. ఇది క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాహుల్ 14 మ్యాచ్ల్లో 593 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అయితే లోకేష్ రాహుల్ అన్సోల్డ్ కావడానికి ప్రధాన కారణం అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది. మహారాజా ట్రోఫీ జూన్ 20 నుంచి జూలై 12 వరకు జరగనుంది. అదే సమయంలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉండనుంది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్లో ఏకైక టెస్టు ఆరంభం కానుంది. రాహుల్ భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. జూన్ 20న అఫ్గానిస్థాన్తో మూడో వన్డే చెన్నైలో జరగనుండగా.. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొంటుంది.
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టోర్నీలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఫ్రాంచైజీలు అతడిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. వేలంలో రాహుల్ బేస్ ప్రైస్ కేవలం రూ.2 లక్షలుగా ఉన్నప్పటికీ.. ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. ఇక మహారాజా ట్రోఫీ టీ20లో కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, విజయ్కుమార్ వైశాక్, శ్రేయాస్ గోపాల్, కరుణ్ నాయర్, మనీష్ పాండే వంటి క్రికెటర్లు పాల్గొననున్నారు.
కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు చివరిసారిగా 2022 టీ20 ప్రపంచక ప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అడిలైడ్ వేదికగా భారత తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం వన్డే జట్టులో ప్రధాన వికెట్కీపర్గా కొనసాగుతున్న రాహుల్.. భవిష్యత్తులో మళ్లీ టీ20 జట్టులోకి వస్తాడా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
