NTV Telugu Site icon

సచిన్‌ రికార్డ్ బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్…

యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతడు ఈ ఘనతలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ను అధిగమించాడు. అయితే శనివారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యాషెస్ టెస్టులో రూట్ 3వ రోజు ఈ ఫీట్ సాధించాడు. 2008లో దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1,600 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆటగాడు రూట్.

ప్రస్తుతం ఈ ఏడాది రూట్ ఇప్పటివరకు 64.24 సగటుతో 1,606 పరుగులు చేశాడు. కేవలం 14 టెస్టులలో ఈ ఘనత అందుకున్నాడు. రూట్ ఈ ఏడాది అత్యధికంగా ఇండియా పైన 228 చేయగా… మొత్తం ఆరు సెంచరీలు చేశాడు. అయితే పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్‌ ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధికంగా 1788 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (1976లో 1,710 పరుగులు), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (2008లో 1,656 పరుగులు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక సచిన్ ఈ రికార్డ్ లో (2010లో 1562 పరుగులు) 6వ స్థానంలో ఉన్నాడు.