Japan T20 Squad vs India: టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అండ్ ప్రపంచ నంబర్ వన్ భారత్, పనికూన జపాన్ జట్ల మధ్య చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్తో తలపడే తమ జట్టును జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు అనుభవజ్ఞులు, యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు జేసీఏ తెలిపింది.
కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ జపాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జపాన్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్ కెండెల్తో పాటు 50కిపైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఇబ్రహీం తకహాషి, డెక్లాన్ సుజుకి-మెక్కాంబ్ కూడా జట్టులో ఉన్నారు. యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జేక్ కుసుడా-నెయిర్న్కు అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్లో ఆకట్టుకున్న అతడు తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు అనుభవజ్ఞుడైన సుయోషి తకాడా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. 2013లో ఐసీసీ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ టీ20 ఛాంపియన్షిప్లో తొలిసారి జపాన్కు ప్రాతినిధ్యం వహించిన తకాడా.. చాలా కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు.
జపాన్ జట్టులో వతారు మియాచి, మకోటో తనియామా వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరిద్దరూ జపాన్ పాఠశాలల్లోని క్రికెట్ ‘బుకాత్సు’ కార్యక్రమాల ద్వారా జట్టులోకి వచ్చారు. లెగ్స్పిన్నర్ తనియామా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ బౌలింగ్ వీడియోలను చూసి తన బౌలింగ్ శైలిని అభివృద్ధి చేసుకున్నాడు. తన అభిమాన ఆటగాడికి గుర్తుగా 23వ నంబర్ జెర్సీని ధరిస్తున్నాడు. జపాన్ పాత్వే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా తనియామా గుర్తింపు పొందాడు.
అండర్-19 ప్రపంచకప్లో టాంజానియాపై జపాన్ విజయంలో భాగమైన చార్లీ హరా-హిన్జ్కు కూడా జట్టులో చోటు లభించింది. మరో స్పిన్నర్ బెంజమిన్ ఇటో-డేవిస్ చేతి గాయం కారణంగా గతంలో జపాన్ 2028 టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ సబ్-రీజినల్ క్వాలిఫయర్ పోటీలకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ క్వాలిఫయర్ టోర్నీలో జపాన్ రెండో స్థానంలో నిలిచింది. పాపువా న్యూ గినియాతో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్రేట్ కారణంగా వెనుకబడింది. అయితే చివరి మ్యాచ్లో పీఎన్జీని ఓడించడంతో 2028 టీ20 ప్రపంచకప్ అర్హత అవకాశాలను జపాన్ సజీవంగా ఉంచుకుంది.
ఆసియా క్రీడలను కూడా దృష్టిలో పెట్టుకుని జపాన్ ఈ జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి నాగోయాలో ఆసియా క్రీడల క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్, జపాన్ మధ్య జరగనున్న ఈ చారిత్రాత్మక మ్యాచ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న తొలి ఈవెంట్ ఇదే. జపాన్ ప్రధాని సనాయే తకాయిచి, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన సదస్సులో కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. క్రీడల ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. భారత్తో మ్యాచ్కు ముందు జపాన్ సెప్టెంబర్ 19, 20 తేదీల్లో హాంకాంగ్తో రెండు టీ20లు ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 24న ఆఫ్ఘనిస్థాన్, సెప్టెంబర్ 26న నేపాల్తో ఆసియా క్రీడల్లో తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే ఆసియా క్రీడల గ్రూప్లో జపాన్ టాప్-2లో నిలవాల్సి ఉంటుంది.
జపాన్ జట్టు:
కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.

