Team India-BCCI: ఆ ఐపీఎల్ స్టార్‌కు ఛాన్స్ ఇవ్వండి.. టీమిండియా టోటల్ సెట్టు ఇగ!

  • వరుస పరాజయాలు ఎదుర్కొంటోన్న భారత్ టీ20 జట్టు
  • శ్రేయస్ కెప్టెన్సీతో పాటు జట్టు ఎంపికపై కూడా విమర్శలు
  • ఆ ఐపీఎల్ స్టార్‌కు ఛాన్స్ ఇవ్వండి అంటున్న మాజీ పేసర్
Irfan Pathan Rajat Patidar

Irfan Pathan Rajat Patidar

Irfan Pathan on Rajat Patidar: భారత్ టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్ అయిన భారత్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ వెనకపడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో శ్రేయస్ కెప్టెన్సీతో పాటు జట్టు ఎంపికపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్టర్లకు కీలక సూచన చేశాడు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన పాటిదార్ జట్టుకు మంచి సమతుల్యతను తీసుకురాగలడని పేర్కొన్నాడు. తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించిన ఇర్ఫాన్.. ‘ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి బ్యాటర్లు ఉన్నారు. అందుకే పాటిదార్‌ను టీమిండియా తప్పకుండా పరిశీలించాలి. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇదే సరైన అవకాశం. పాటిదార్‌కు అవకాశం దక్కాలని నేను ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.

ఇప్పటివరకు రజత్ పాటిదార్ భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోయినా.. దేశవాళీ టీ20ల్లో అతడి గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 106 ఇన్నింగ్స్‌ల్లో 3,389 పరుగులు చేసిన పాటిదార్.. 160.08 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యం అతడిని ప్రత్యేక బ్యాటర్‌గా నిలబెట్టాయి. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా పాటిదార్ సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) ఛాంపియన్‌గా నిలిపి తన నాయకత్వ ప్రతిభను నిరూపించాడు. ఒత్తిడి పరిస్థితుల్లో జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం అతడికి ఉంది.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 19 ఓవర్లలోనే ఛేదించింది. ఆరంభంలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసి భారత్‌కు శుభారంభం అందించినప్పటికీ.. హ్యారీ బ్రూక్ 15 బంతుల్లో 39 పరుగులతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అనంతరం జేకబ్ బెతెల్ అజేయంగా 76 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు నోబాల్స్ కారణంగా వచ్చిన ఫ్రీహిట్లతో ఏకంగా 29 పరుగులు రావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలవగా.. టీమిండియా తిరిగి పుంజుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.