Yashasvi Jaiswal: వైభవ్‌ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!

  • లక్నోపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం
  • వైభవ్‌ సూర్యవంశీ హీరోచిత ఇన్నింగ్స్‌
  • అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్, బ్రిజేశ్
Rr Captain Yashasvi Jaiswal

Rr Captain Yashasvi Jaiswal

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. లక్షాన్ని రాజస్థాన్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ విజయంలో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (93; 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సులు) కీలక పాత్ర పోషించాడు. అయితే హీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్‌ బాగానే ఆడినా.. లక్నోను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని ఆర్ఆర్ స్టాండ్-ఇన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ చెప్పాడు. ఓ సమయంలో 250 స్కోరు చేసేలా కనిపించిన లక్నో.. రాజస్థాన్ బౌలర్ల దాటికి 220తో సరిపెట్టుకుంది. జట్టులో ప్రతి ఆటగాడు కష్టపడి ఆడాడని, ఈ విజయం మొత్తం టీమ్ ఎఫర్ట్ ఫలితమని పేర్కొన్నాడు

ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మ బౌలింగ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారిందని యశస్వి జైస్వాల్ చెప్పాడు. ‘ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ అని మాకు ముందే తెలుసు. ఇక్కడ పరుగులు రావడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో జోఫ్రా ఆర్చర్ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయడం మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చింది. బ్రిజేశ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ మ్యాచ్‌ను పూర్తిగా మా వైపు తిప్పింది. వాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. ఈ విజయం జట్టుకు చాలా అవసరం. కోచింగ్ స్టాఫ్ కూడా తెర వెనుక చాలా కష్టపడ్డారు. అందరికీ క్రెడిట్ ఇవ్వాలి’ అని యశస్వి తెలిపాడు.

బౌలర్లను ఎలా మేనేజ్ చేశారనే ప్రశ్నకు జైస్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘బ్రిజేశ్‌కు చిన్న నిగిల్స్ ఉన్నాయి. సందీప్ శర్మ కూడా పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. అందుకే బౌలింగ్ మార్పులు చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. దేశ్‌పాండేను తీసుకురావాలనుకున్నా. అతడు బాగా బౌలింగ్ చేస్తే మరో ఓవర్ ఇవ్వాలనుకున్నా. మ్యాచ్‌లో నేను తీసుకున్న నిర్ణయాలు బాగా పనిచేశాయి. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఈ వికెట్‌పై పరుగులు వస్తాయని మాకు తెలుసు. అయినా కూడా బౌలర్లు తమ ఏరియాల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు’ అని వివరించాడు.

‘220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో మేము చాలా సింపుల్‌గా ఆలోచించాం. మంచి క్రికెటింగ్ షాట్లు ఆడుతూ మొమెంటమ్‌ను కొనసాగించాలని భావించాం. నేను, వైభవ్ ఇద్దరం మాట్లాడుకున్నాం. ఒక్కరైనా చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాం. వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నేను ఎప్పుడూ నవ్వుతూ క్రికెట్ ఆడాలని కోరుకుంటాను. అదే అసలైన ఆనందం. పరిస్థితులు ఎలా ఉన్నా బ్యాలెన్స్‌గా ఉండాలి. అభిమానుల ప్రేమను ఆస్వాదిస్తూ, ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. మైదానంలో మా శక్తివంచన లేకుండా కష్టపడటం గొప్ప అనుభూతి’ అని యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు.