Virat Kohli opens up after RCB’s IPL 2026 title victory: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ టైటిల్ గెలిచిన తర్వాతే బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్షిప్లపై దృష్టి పెట్టామని, అదే లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపాడు. ఫైనల్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. టోర్నీ ప్రారంభం నుంచే జట్టు లక్ష్యం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమేనని చెప్పాడు.
‘మా మొదటి లక్ష్యం టేబుల్ టాపర్గా నిలవడం. మేము అది సాధించాం. ఆ తర్వాత ఫైనల్లో ఎవరితో ఆడాలనుకుంటున్నారని చాలామంది అడిగారు. కానీ మాకు ప్రత్యర్థి ఎవరో ముఖ్యం కాదు. మా దృష్టి పూర్తిగా ఆర్సీబీపైనే ఉంది. మేము ఇతర జట్ల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ ప్రత్యర్థులను గౌరవిస్తాం. మాకు మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం. జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడి పరిస్థితుల్లో అనుభవమే తేడా చూపిస్తుంది. ఉత్సాహం, దూకుడు ఎంత ఉన్నా.. బిగ్ మ్యాచ్ల్లో సీనియర్ ఆటగాళ్లే ముందుకు రావాలి. ఈ ఫైనల్లో కూడా మేము అదే చేశాం. కష్టమైన పరిస్థితుల్లో అనుభవం మాకు ఉపయోగపడింది’ అని చెప్పాడు.
ఈ సీజన్లో జట్టు సమిష్టి ప్రదర్శన తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ‘ఈరోజు కూడా ప్రత్యర్థి జట్టు నన్ను త్వరగా అవుట్ చేయాలని చూస్తుందని తెలుసు. కానీ నేను త్వరగా అవుట్ అయినా మ్యాచ్ను ముగించే ఛాంపియన్ జట్టు మా వద్ద ఉందనే నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకంతో నేను బౌలర్లపై దాడి చేయగలిగాను. స్క్వాడ్ను అద్భుతంగా నిర్మించిన మేనేజ్మెంట్కు, ఆటగాళ్ల ప్రతిభకు, వారి ఆత్మవిశ్వాసానికి క్రెడిట్ ఇవ్వాలి. గత ఏడాది ట్రోఫీ గెలిచినప్పుడు మో బొబాట్ ఇది ముగింపు కాదు, వరుసగా రెండు టైటిళ్లు గెలవాలి అన్నాడు. ఇప్పుడు మేము ఆ లక్ష్యాన్ని సాధించాం’ అని కోహ్లీ అన్నాడు.
ఫైనల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. పవర్ప్లేలోనే మ్యాచ్ను తమ వైపు తిప్పుకోవాలనుకున్నామని వెల్లడించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో వెంకటేశ్ అయ్యర్తో ఒక చిన్న చర్చ జరిగింది. పవర్ప్లేలోనే మ్యాచ్ను ముగించేలా ఆడాలని నేను చెప్పాను. అతను ఓకే అన్నాడు. మాకు పూర్తి స్పష్టత ఉంది. పెద్ద మ్యాచ్ల్లో రన్రేట్ పెరగనివ్వకూడదనేది మా ఆలోచన. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ఆడాం. వెంకటేశ్ అయ్యర్ గత మూడు, నాలుగు మ్యాచ్ల్లో చూపిన దూకుడు మా విజయాల్లో కీలక పాత్ర పోషించింది’ అని కోహ్లీ వివరించాడు.
‘మేము ఏడు హోమ్ మ్యాచ్లు మాత్రమే ఆడమని నేను ఎప్పుడూ అనుకోను. మేము 14 హోమ్ మ్యాచ్లు ఆడుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఆర్సీబీ అభిమానులు మాకు మద్దతుగా ఉంటారు. ఈ ఫైనల్ గుజరాత్ హోమ్ గ్రౌండ్లో జరిగినా స్టేడియంలో 90 శాతం మంది ఆర్సీబీ అభిమానులే కనిపించారు. ఎన్నేళ్లుగా మేము సంపాదించుకున్న ప్రేమ అది. వారి మద్దతు అమూల్యం. ఈరోజు ట్రోఫీని ఎత్తిన క్షణాన్ని వారు ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని కింగ్ కోహ్లీ భావోద్వేగంగా చెప్పాడు.
