ఐపీఎల్ 2026, 40వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్పై కేవలం 22 బంతుల్లో 62 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన స్టోయినిస్, చివరి ఓవర్లో 24 పరుగులు (4, 6, 6, 4, 4) రాబట్టి గ్రౌండ్ ను షేక్ చేశాడు. ముల్లన్పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టోయినిస్, మైదానంలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం (50) సాధించి 22 బంతుల్లోనే 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 281.82. చివరి రెండు ఓవర్లలో పంజాబ్ 41 పరుగులు రాబట్టగా, ఒక్క 20వ ఓవర్లోనే బ్రిజేష్ శర్మ బౌలింగ్లో స్టోయినిస్ 24 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ 222/4 భారీ స్కోరు నమోదు చేసింది.
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఈ మ్యాచ్లో స్టోయినిస్ ఐపీఎల్లో మరో ముఖ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 20వ ఓవర్లో (కనీసం 100 పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో) అత్యధిక స్ట్రైక్ రేట్తో రోహిత్ శర్మను అధిగమించాడు. అంతకుముందు రోహిత్ శర్మ 20వ ఓవర్లో 282.42 స్ట్రైక్ రేట్తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స్టోయినిస్ ఇప్పుడు దానిని 297.62కి అప్డేట్ చేశాడు. డెత్ ఓవర్లలో (16-20) కూడా స్టోయినిస్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో స్టోయినిస్ 179 బంతులు ఎదుర్కొని 458 పరుగులు (స్ట్రైక్ రేట్ 255.86) చేశాడు. ఈ కాలంలోనే 43 ఫోర్లు, 35 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో స్టోయినిస్కు ఇది మొదటి అర్ధశతకం కాగా, ఐపీఎల్ కెరీర్లో ఇది 10వ అర్ధశతకం. చివరి ఓవర్లలో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మన్గా తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
