Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!

  • ఐపీఎల్ 2026లో పెద్ద చర్చనీయాంశంగా వేప్ వివాదం
  • డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ-సిగరెట్‌ తాగుతూ దొరికిన పరాగ్
  • వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు
Riyan Parag Vape Controversy

Riyan Parag Vape Controversy

RR Captain Riyan Parag React on Vape Controversy: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ చుట్టూ వేప్ (ఈ-సిగరెట్‌) వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ-సిగరెట్‌ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పరాగ్‌పై ఐపీఎల్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ చేర్చారు. పరాగ్‌ తన తప్పును అంగీకరించడంతో… ఎలాంటి విచారణ అవసరం లేకుండా పోయింది.

ఈ-సిగరెట్‌ అంశంపై అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విభిన్న విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ స్వయంగా స్పందించాడు. తాను విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని, తన దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని స్పష్టం చేశాడు. ‘ఈ విషయంపై విమర్శకులకు లేదా ఇతరులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. రోజు చివరికి నా పని జట్టుకు రెండు పాయింట్లు అందించడమే. బయట జరిగే వివాదాలపై నేను ఫోకస్ చేయను. జట్టుగా విజయం సాధించడం ముఖ్యం. వ్యక్తిగత అంశాలు నా దృష్టి మరల్చలేవు’ అని పరాగ్ చెప్పాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఎట్టకేలకు ఫామ్‌ అందుకుని కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్‌ను గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమని పరాగ్ తెలిపాడు. ‘నేను ఎంత బాగా ఆడినా జట్టు ఓడిపోతే ఆ ఇన్నింగ్స్‌కు విలువ ఉండదు. భారీ స్కోర్ చేసినా ఓడినందుకు బాధగానే ఉంది. మాకు ఇప్పుడు ఒక వారం విరామం ఉంది. ఆ సమయంలో వివాదంను క్లియర్ చేస్తాం. ప్రస్తుతం రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేస్‌లో ఉంది. కాబట్టి జట్టు ఫోకస్ మొత్తం మ్యాచ్‌లపై ఉంది’ అని పరాగ్ పేర్కొన్నాడు.