Riyan Parag Blasts RR After Loss To DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో రాజస్థాన్కు ఇది ఆరో ఓటమి. వరుసగా మూడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను ఆర్ఆర్ సంక్లిష్టం చేసుకుంది. వరుస పరాజయాలపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ఆటతీరు పూర్తిగా నిరాశపరిచిందని, ఇలాగే ఆడితే తాము ప్లేఆఫ్స్కు అర్హులం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్రతి విభాగంలో విఫలమయ్యామని పరాగ్ అంగీకరించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే.. మేం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. 14 ఓవర్ల వరకు మంచి స్థితిలో ఉన్నాం. కానీ నేను ఔటైన తర్వాత మొమెంటమ్ మారిపోయింది. అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయాం. మేము కనీసం 220-230 పరుగులు చేయాల్సింది. కానీ 193 పరుగులకే పరిమితం అయ్యాం. బౌలింగ్ యూనిట్ కూడా అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేకపోతోంది’ అని తెలిపాడు. డొనోవన్ ఫెరెయిరాకు బౌలింగ్ ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై పరాగ్ స్పందించాడు. ‘టీవీలో చూస్తే అది గ్యాంబుల్లా అనిపించొచ్చు. కానీ క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే డొనోవన్తో ట్రై చేద్దాం అనుకున్నా. శనకతో మరో ఓవర్ వేయించాలనుకోలేదు’ అని వివరించాడు.
ఫీల్డింగ్పై పరాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘ట్రోఫీ గెలవాలంటే, ప్రతి ఏడాది టైటిల్ కోసం పోటీ పడాలంటే.. మేం ఈరోజు చేసిన దానికంటే ఎంతో మెరుగ్గా ఉండాలి. మా జట్టు సామర్థ్యం దీనికంటే చాలా ఎక్కువ. కానీ గత నాలుగు, ఐదు మ్యాచ్లలో మేం అసలు ఆ స్థాయిలో ఆడలేదు. జట్టు ఎనర్జీ, స్కిల్స్, ఎగ్జిక్యూషన్ ఏదీ సరైన స్థాయిలో లేదు. బ్రేక్ తర్వాత మైదానంలో చూపించిన ఆట అసలు సరిపోదు. ఇలాగే ఆడుతూ ఉంటే టాప్-4లో ఉండం’ అని స్పష్టం చేశాడు.
ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా రియాన్ పరాగ్ స్పందించాడు. ‘ఇప్పుడు మేం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. నాకు అలాంటి పరిస్థితి నచ్చదు. ఇతర జట్లు ఓడిపోతే మేం అర్హత సాధిస్తామనే ఆలోచనతో నేను జట్టుతో మాట్లాడను. మాకు అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని వినియోగించుకోలేకపోయాం. ఒకవేళ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోతే.. అది పూర్తిగా మా తప్పే’ అని పరాగ్ స్పష్టం చేశాడు. చివరగా మిగిలిన రెండు మ్యాచ్ల్లో మెరుగైన ఆటతో గెలవాలని ఆశిస్తున్నట్లు పరాగ్ తెలిపాడు.
