RCB vs GT Playing XI for IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 సమరానికి తెరలేచింది. మంగళవారం జరగబోయే కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్ దశలో ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ.. మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్ స్థానం కోసం ఎలిమినేటర్ (రాజస్థాన్ vs హైదరాబాద్) విజేతతో క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది.
ఆర్సీబీ జోరు:
గత సీజన్లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన బెంగళూరు.. ఈ ఏడాది కూడా అదే ఫామ్ను కొనసాగించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు సాధించి పట్టికలో టాపర్గా నిలిచింది. రజత్ పాటీదార్ నాయకత్వంలోని ఆర్సీబీ.. అటు దూకుడైన బ్యాటింగ్, ఇటు పటిష్టమైన బౌలింగ్తో ఈ సీజన్లోనే అత్యంత నిలకడైన జట్టుగా నిలిచింది. ముఖ్యంగా బయటి మైదానాల్లో, ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో గెలవగలిగే సామర్థ్యం ఈ జట్టుకు అదనపు బలంగా మారింది.
సాల్ట్ ఆడే అవకాశాలే ఎక్కువ:
విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ జట్టుకు కలిసిరానుంది. 14 మ్యాచ్ల్లో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలతో 557 పరుగులు చేశాడు. 50.63 సగటు, 163.82 స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తూ జట్టుకు వెన్నుముకగా నిలిచాడు. దేవదత్ పడిక్కల్ (433 పరుగులు) అద్భుతమైన ఫామ్లో ఉండగా.. టిమ్ డేవిడ్ (277), ఫీల్ సాల్ట్ (202), కృనాల్ పాండ్య (182)లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఒకవేళ గాయం కారణంగా సాల్ట్ దూరమైతే.. వెంకటేష్ అయ్యర్ (158 పరుగులు) తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా సాల్ట్ ఆడే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే అతడి మొదటి బంతి నుంచే విరుచుకుపడుతాడు. వెంకీ ఇంపాక్ట్ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. భువనేశ్వర్ కుమార్ కేవలం 8.07 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి బౌలింగ్ను ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా హేజిల్వుడ్ (12 వికెట్లు), రసిఖ్ సలామ్ (14), కృనాల్ పాండ్య (11)లు రాణిస్తున్నారు.
గుజరాత్ టాప్-2 పంచ్:
గుజరాత్ టైటాన్స్కు ఇది ఐదో ఐపీఎల్ సీజన్ మాత్రమే అయినప్పటికీ.. లీగ్లో తనదైన ముద్ర వేసింది. ఐపీఎల్ 2026లో మొదటి 7 మ్యాచ్ల్లో 4 ఓడిపోయినప్పటికీ.. తర్వాతి 7 మ్యాచ్ల్లో 6 గెలిచి అద్భుతంగా పుంజుకుంది. మొత్తంగా 18 పాయింట్లతో టాప్-2 స్థానంలో నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (638 పరుగులు), శుభ్మన్ గిల్ (616 పరుగులు) టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన టాప్-2 బ్యాటర్లు. మూడో స్థానంలో జోస్ బట్లర్ (469 పరుగులు) కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ (సుందర్, హోల్డర్, తెవాతియా) మరింత మెరుగవ్వాల్సి ఉంది.
మార్పులు లేవు:
24 వికెట్లతో రబాడ టోర్నీలోనే టాప్ బౌలర్గా భువనేశ్వర్తో సమానంగా ఉన్నాడు. కొత్త బంతితో రబాడ, మహ్మద్ సిరాజ్ (17 వికెట్లు) ద్వయం ప్రత్యర్థులను వణికిస్తుండగా.. ప్రసిద్ధ్ కృష్ణ (14 వికెట్లు), రషీద్ ఖాన్ (19 వికెట్లు) పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇక రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు. మానవ్ సుతార్ లేదా సాయి కిశోర్లలో ఒకరు ఆడనున్నారు. గుజరాత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవు. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో ధర్మశాలలో హై-వోల్టేజ్ మ్యాచ్ గ్యారెంటీగా కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా):
ఆర్సీబీ: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్వుడ్, రసిఖ్ సలామ్.
జీటీ: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, హోల్డర్, తెవాతియా, నిశాంత్ సింధు, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడ, సిరాజ్, సాయికిశోర్/మానవ్ సుతార్.
