PBKS Worst Record in Dharamsala: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకూ తమ సొంత మైదానం ఒక పెద్ద బలంగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు.. ఇలా అన్నీ జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తాయి. అయితే ఐపీఎల్ 2026లో మాత్రం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా ధర్మశాల వేదిక పంజాబ్కు ఏమాత్రం కలిసి రావడం లేదు. సొంత మైదానంలోనే వరుస పరాజయాలతో పీబీకేఎస్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించే పరిస్థితి నెలకొంది.
ధర్మశాలలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ మొత్తం 17 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించగా.. 11 మ్యాచ్లలో ఓటమిపాలైంది. ముఖ్యంగా 2023 తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత మూడు సీజన్లలో ధర్మశాలలో పంజాబ్ 8 మ్యాచ్లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగతా 7 మ్యాచ్లలో పరాజయం చవిచూసింది. దీంతో ధర్మశాల ఇప్పుడు పంజాబ్కు హోమ్ గ్రౌండ్ కంటే.. ప్రత్యర్థి జట్లకు అదృష్ట వేదికగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో మరో చెత్త రికార్డుకు చేరువైంది. పీబీకేఎస్ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కు ఇది రెండో అత్యంత చెత్త లూజింగ్ స్ట్రీక్. 2015లో పంజాబ్ వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు మరో ఓటమి నమోదైతే.. 2015 చెత్త రికార్డును సమం చేస్తుంది. 2011, 2018, 2020 సీజన్లలో కూడా పంజాబ్ వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. పంజాబ్ జట్టు స్థిరమైన ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
హోమ్ గ్రౌండ్లోనే వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కీలక సమయాల్లో బౌలింగ్ విభాగం విఫలమవుతుండటం పీబీకేఎస్కు పెద్ద సమస్యగా మారింది. నిజానికి పంజాబ్ సొంత మైదానం ధర్మశాల కాదు. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రాథమిక మైదానం. ద్వితీయ సొంత మైదానం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కొన్ని మ్యాచ్లు ఆడుతోంది.
