MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!

  • సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
  • సీఎస్‌కే, ధోనీ అభిమానులకు మరోసారి ఆశలు
  • 2027 సీజన్‌లో కూడా ఎంఎస్ ధోనీ
Ms Dhoni Ipl 2027

Ms Dhoni Ipl 2027

MS Dhoni Will Play IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే), ఎంఎస్ ధోనీ అభిమానులకు మరోసారి ఆశలు కలిగేలా సీఎస్‌కే మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఐపీఎల్ ప్రయాణం ఇంకా ముగియలేదని, 2027 సీజన్‌లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని రైనా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో సీఎస్‌కే తమ చివరి హోమ్ మ్యాచ్‌ను సోమవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన నేపథ్యంలో.. అదే ధోనీ చివరి మ్యాచ్ కావొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చెన్నై ఆటగాళ్లు ల్యాప్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీని మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా కలిశాడు. ఆ తర్వాత స్టార్స్ స్పోర్ట్స్‌లో మాట్లాడిన రైనా.. ధోనీతో జరిగిన సంభాషణను వివరించాడు. ‘నేను ధోనీతో మాట్లాడాను. ఐపీఎల్ 2026లో నువ్వు ఆడలేదు. ఈ సీజన్ లెక్కలోకి రాదు. వచ్చే ఏడాది మళ్లీ రావాలి, ఆడాలి అని అన్నాను’. అందుకు నా శరీరం అంతగా సహకరించడం లేదని ధోనీ అన్నాడు’ అని రైనా చెప్పాడు. ‘మేము ఏమీ నమ్మడం లేదు. నువ్వు వచ్చే ఏడాది కూడా ఆడాల్సిందే అని చెప్పాను’ అని రైనా వెల్లడించాడు.

ఎంఎస్ ధోనీ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించలేదని రైనా స్పష్టం చేశాడు. ‘ఇది పూర్తిగా ఎంఎస్ ధోనీ వ్యక్తిగత నిర్ణయం. కానీ అతడు చాలా పాజిటివ్‌గా కనిపించాడు. జట్టు కూడా మళ్లీ బాగా ఆడుతోంది. అభిమానులు కూడా నిన్ను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పాను. దానికి ధోనీ చూద్దాం, చూద్దాం అన్నాడు. నాతో ఇలా అన్నాడంటే మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నట్టే’ అని రైనా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సన్‌రైజర్స్ మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనీ జట్టు బస్సు నుంచి దిగిన క్షణం చెపాక్ స్టేడియం మొత్తం ఉత్సాహంతో మార్మోగిపోయింది. ఈ సీజన్‌లో మ్యాచ్ రోజులలో జట్టుతో కలిసి ఎక్కువగా మహీ ప్రయాణించలేదు. తన రాకతో జట్టు కాంబో దెబ్బతింటుందని భావించి దూరంగా ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ మధ్య విరామ సమయంలో ధోనీ మైదానంలోకి వచ్చి జట్టు ఫోటోషూట్‌లో పాల్గొనగా.. అభిమానులు భారీగా హర్షధ్వానాలు చేశారు. మ్యాచ్ అనంతరం ల్యాప్ ఆఫ్ ఆనర్ సమయంలో కూడా ధోనీ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. గ్రౌండ్ స్టాఫ్‌తో ఫోటోలు దిగాడు. ఫోటోగ్రాఫర్లతో సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. చూడాలి మరి ధోనీ ఏదైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడో.