ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి మరీ దారుణంగా మారింది. బుధవారం వాంఖడేలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై పరాజయం అనంతరం ఎంఐ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్కోర్ చేసినా విజయం దూరమైంది. సొంత మైదానం వాంఖడేలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాల పరంపర అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం ఎంఐ ఓనర్ నీతా అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓటమితో తీవ్ర నిరాశకు గురైన నీతా.. డగౌట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జట్టు ప్రదర్శనపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అకాశ్ అంబానీ తీసుకున్న నిర్ణయాలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో కేవలం 2 విజయాలే సాధించిన ముంబై.. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్లన్నింటిలో గెలవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అది అంత సులభం కాదనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ముంబై విఫలమవుతోంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు సమష్టిగా రాణించలేకపోతోంది. ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం, బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ముంబై ఇండియన్స్కు ఇది అత్యంత కఠినమైన సీజన్గా మారింది. ఇకపై జరిగే మ్యాచ్లలో తిరిగి పుంజుకుని అభిమానులకు సంతోషం కలిగిస్తుందా? లేదా ఈ సీజన్ను నిరాశతో ముగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
