IPL Rules Change: ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటర్లకు అధిక ప్రాధాన్యం లభిస్తుండగా.. బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ నిబంధనల్లో రెండు ప్రధాన మార్పులు అవసరమని కైఫ్ సూచించాడు.
‘మైదానాల పరిమాణాన్ని స్థిరంగా ఉంచాలి. ప్రస్తుతం కొన్ని స్టేడియాల్లో బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటర్లు సులభంగా భారీ షాట్లు ఆడుతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్లో 250-300 పరుగులు సాధారణంగా మారిపోయాయి. 150-170 వంటి స్కోర్లను కాపాడటం బౌలర్లకు దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే అన్ని మైదానాల్లో ఒకే విధమైన, కొంచెం పెద్ద బౌండరీలను ఉంచాలి. ఇది బౌలర్లకు కొంత వరకు న్యాయం చేస్తుంది’ అని మొహమ్మద్ కైఫ్ మొదటి మార్పుగా చెప్పాడు.
ఇక రెండో మార్పుగా.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తొలగించాలని కైఫ్ స్పష్టం చేశాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లు అదనపు బ్యాటర్ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. దీని వల్ల బౌలర్ల ప్రాముఖ్యత తగ్గిపోతోంది. అంతేకాకుండా ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్లో లేకపోవడం కూడా దాని అవసరంపై సందేహాలు కలిగిస్తోంది. ఐపీఎల్లో ఈ నిబంధన వల్ల మ్యాచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో బౌలర్లకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కైఫ్ ఈ సూచనలు చేశాడు. భవిష్యత్తులో బీసీసీఐ ఈ అంశాలను పరిశీలించి మార్పులు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
