ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య న్యూ చండీగఢ్లో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ఒక ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్న జడేజా, ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రవీంద్ర జడేజా మోచేతి గాయం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో జడేజా మోచేతికి భారీగా బ్యాండేజ్ (టేప్) వేసి ఉండటం కనిపించింది. ఫిజియోల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం, జట్టుకు అవసరమైన సమయంలో జడేజా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు, 13వ ఓవర్లో ఆయన మళ్లీ బ్యాటింగ్కు వచ్చి జట్టుకు అండగా నిలిచాడు.
టాస్ రీ-స్పిన్: ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పరాగ్ టాస్ పిలుపు (Call) మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్కు స్పష్టంగా వినబడకపోవడంతో టాస్ను మరోసారి వేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఎలిమినేటర్లో సన్రైజర్స్ను ఓడించి ఆర్ఆర్ ఇక్కడికి రాగా, క్వాలిఫైయర్-1లో ఆర్సిబి చేతిలో ఓడిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్ ద్వారా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.
