Virat Kohli: మొత్తానికి కింగ్ కోహ్లీ మనసులో ఉన్న అసలైన ఎమోషన్స్ బయటపడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆ చారిత్రాత్మక క్షణంపై విరాట్ కోహ్లీ తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో మనసు విప్పి మాట్లాడాడు. తన కెరీర్ ముగిసేలోపు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటం తన క్రికెట్ ప్రయాణంలోనే అత్యంత ఎమోషనల్, సంతృప్తికరమైన క్షణమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆ విజయం తర్వాత తాను ఎందుకు అంతగా భావోద్వేగానికి లోనయ్యాడో వివరిస్తూ.. “ఆ సమయంలో నాలోని భావాలన్నింటినీ మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఒక్కసారిగా మోకాళ్లపై కూలబడి, చేతులు జోడించి.. ‘భగవంతుడా.. నేను ఆటను ఆపేసేలోపు ఈ అనుభూతిని నాకు అందించినందుకు థాంక్యూ’ అని దండం పెట్టుకున్నా” అని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. గత ఏడాది జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ గెలుపు గుర్తులను నెమరువేసుకుంటూ.. 2008 నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ప్రయాణిస్తూ, కెప్టెన్గా కూడా వ్యవహరించిన కోహ్లీ, ఎన్నోసార్లు ట్రోఫీకి దగ్గరగా వచ్చి చేజార్చుకున్న ఆ చేదు జ్ఞాపకాలే ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని అన్నాడు.
“చివరి ఓవర్ లోని ఆ ఆఖరి నాలుగు బంతులు వేస్తున్నప్పుడు నా గుండెల్లో ఎలాంటి భావన కలిగిందో ఇతరులకు మాటల్లో చెప్పడం చాలా కష్టం. బయట నుంచి చూసేవారికి ఆర్సీబీ అంటే ఒక పెద్ద టీమ్, పెద్ద ఫ్రాంచైజీ.. కానీ ఎప్పుడూ గెలవని టీమ్, కేవలం ఫైనల్స్ దాకా వచ్చే రన్నరప్స్ మాత్రమే అనే ముద్ర ఉండేది. ఆ ఒత్తిడిని ఏడాది తర్వాత ఏడాది భరించడం సామాన్యం విషయం కాదు. బయట నుంచి గమనించడం వేరు, దానిని స్వయంగా అనుభవించడం వేరు. నేను ఆ ప్రతీ సీజన్ను అనుభవించాను” అని కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఒకవేళ ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోయి ఉంటే.. తాను జీవితాంతం పశ్చాత్తాపంతో బతికేవాడిని కాకపోవచ్చు కానీ, ఇంతటి అద్భుతమైన అనుభూతిని మిస్ అయ్యానే అనే వెలితి మాత్రం నాలో ఖచ్చితంగా ఉండేదని 37 ఏళ్ల కోహ్లీ ఒప్పుకున్నాడు. “ఖచ్చితంగా, పూర్తి నిజాయితీతో నేను ఒక విషయం చెప్పగలను. ఒకవేళ మేము ఆరంభ సంవత్సరాల్లోనే ఈ ట్రోఫీని గెలిచి ఉంటే.. ఇప్పుడు కలిగిన అనుభూతిలో కనీసం 5 శాతం కూడా ఉండేది కాదు. ఇన్నేళ్ల ఒత్తిడి, ఆరాటం అన్నీ కలిసి 18 ఏళ్ల తర్వాత ఈ రూపంలో విజయంగా మారడం అనేది నా క్రికెట్ ప్రయాణంలోనే అత్యుత్తమ అనుభవం” అని కోహ్లీ స్పష్టం చేశాడు.
