ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్పై రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ను ఎదుర్కోవడంపై తనదైన శైలిలో స్పందించాడు.
బుమ్రా బౌలింగ్ భీకరంగా ఏమీ లేదు..
ఇటీవల జరిగిన మ్యాచ్లో బుమ్రాతో తలపడిన అనుభవం గురించి సూర్యవంశీ మాట్లాడుతూ.. “బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా ఏమీ లేదు” అని వ్యాఖ్యానించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా, తాను కేవలం బంతిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించానని చెప్పాడు. తన కెరీర్లో తొలిసారి బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ను ఎదుర్కొన్నప్పటికీ, ఏమాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం విశేషం.
Also Read:Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
మంగళవారం రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ముందుగా ఓపెనింగ్ బ్యాటింగ్కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ దిగారు. మొదటి బంతి నుంచే సిక్సులు, ఫోర్లతో ఇద్దరు దూకుడుగా ఆడటంతో ఆ మ్యాచ్లో ఆర్ఆర్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్లో మొదటి బంతికే సిక్స్ బాదాడు సూర్యవంశీ.
అంతే కాకుండా.. బుమ్రా వేసిన తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాదాడు వైభవ్ సూర్య వంశీ. ఐపీఎల్లో బుమ్రా లాంటి బౌలర్ను ఇలా ఎదుర్కోవడం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే సాధ్యం కాదు, కానీ చిన్న వయసులోనే సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఈ దూకుడు చూసి స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్..
సూర్యవంశీ చేసిన ఈ ధీటైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ “14 ఏళ్ల కుర్రాడికి ఇంత ధైర్యమా?” అని ప్రశంసిస్తుంటే, బుమ్రా ఫ్యాన్స్ మాత్రం “నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా సమాధానం చెబుతాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. భయం లేకుండా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే సూర్యవంశీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. భారత క్రికెట్కు మరో స్టార్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
