Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు.

ఈ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడిన వైభవ్.. 16 మ్యాచ్‌లలో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ , ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం పరుగులు చేయడమే కాకుండా.. దాదాపు 237.3 స్ట్రైక్ రేట్‌తో, 48.5 సగటుతో ఎంతో వేగంగా బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని అద్భుతమైన ఆటతీరు వల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ వరకు చేరుకోగలిగింది. అయితే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయి రాజస్థాన్ టోర్నీ నుండి నిష్క్రమించింది.

×
×
Ad

చివరి వరకు ఉత్కంఠ..
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే వరకు ఈ ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ కొనసాగింది. రేసులో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (732 పరుగులు), సాయి సుదర్శన్ (722 పరుగులు) ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే (గిల్ 10, సుదర్శన్ 12) అవుట్ కావడంతో వైభవ్ స్థానం ఖరారైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 600 పరుగులతో ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ గెలవడానికి కేవలం 156 పరుగుల లక్ష్యమే ఉండటంతో కోహ్లీకి వైభవ్‌ను దాటే అవకాశం లేకుండా పోయింది.

విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టి ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆరెంజ్ క్యాప్ గెలవడం భారత క్రికెట్‌లో అతని గొప్ప భవిష్యత్తుకు నిదర్శనంగా నిలిచింది.