Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..

Vaibhav Sooryavanshii

Vaibhav Sooryavanshii

15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో ఐపీఎల్ సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను, ఏకంగా 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అతను వరుసగా రెండుసార్లు 90కి పైగా పరుగులు చేయడంతో, అతనికి భారత జాతీయ జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ అసాధారణ ప్రదర్శనకు గాను అతనికి ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ , ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులు దక్కాయి. అంతేకాకుండా.. 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ‘సూపర్ స్ట్రైకర్’ అవార్డును, అలాగే రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది ‘సూపర్ సిక్సెస్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. వైభవ్ సాధించిన ఈ ఘనతపై సాక్షాత్తూ విరాట్ కోహ్లీ “ఏక్ బిహారీ” అంటూ ప్రశంసించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పందిస్తూ.. అతని ఆటతీరులో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు (ప్రీమెడిటేషన్) ఉండవని, ప్రపంచంలోని అత్యుత్తమ హిట్టర్లు కూడా బంతి తమకు నచ్చిన జోన్‌లోకి వచ్చే వరకు ఎదురుచూస్తారని, కానీ వైభవ్ మాత్రం గంటకు 99 మైళ్ల వేగంతో వచ్చే బంతిని సైతం క్షణాల్లో అంచనా వేసి చాలా క్లీన్‌గా సిక్సర్‌గా మలచగలడని అభినందించాడు.

×
×
Ad

మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబైలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నాడు. రాజస్థాన్, ముంబై జట్ల మధ్య జరిగిన ఒక కీలక మ్యాచ్ సమయంలో తాను వైభవ్‌ను కలిసి, “మ్యాచ్‌ల కోసం ఎలా సిద్ధమవుతావు?” అని అడగ్గా.. “కార్టూన్లు చూస్తాను” అని వైభవ్ బదులిచ్చాడట. “మరి ప్రాక్టీస్ చేస్తావా?” అంటే “లేదు” అని, “ఏం తింటావు?” అని అడిగితే “అన్నీ తింటాను” అని చాలా సాధారణంగా సమాధానం చెప్పాడని వాన్ గుర్తుచేసుకున్నాడు. కార్టూన్లు చూస్తూ, నచ్చింది తింటూ, బంతిని మైదానం వెలుపలికి పంపే వైభవ్ శైలిని చూసి వాన్ ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత వైభవ్ త్వరలోనే శ్రీలంకలో జరిగే ఇండియా-ఎ త్రైపాక్షిక సిరీస్‌లో ఆడనున్నాడు.. అలాగే త్వరలో జరగబోయే ఐర్లాండ్ పర్యటనకు కూడా అతను భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో వైభవ్ సూర్యవంశీ వన్డే క్రికెట్ ఆడే అవకాశాలు ఎంతో దూరంలో లేవని దిగ్గజాలు సైతం పేర్కొంటున్నారు.