IPL 2026: ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..

Tripurana Vijay

Tripurana Vijay

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2026 బరిలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా విజయ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ పైన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తెలుగు కుర్రాడైన త్రిపురాన విజయ్ సాధించిన ఈ గొప్ప మైలురాయిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సందేశం..
మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సాధారణ యువకుడు జాతీయ స్థాయిలో ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై నిలవడం తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు. శ్రీకాకుళం నేల ఎప్పుడూ ప్రతిభకు, పట్టుదలకు నిలయమే అని… దేశ సేవలో సైనికులుగానైనా, క్రీడారంగంలో సత్తా చాటే యువకులుగానైనా మన ప్రాంత యువత అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందన్నారు. ఈ అరంగేట్రం త్రిపురాన విజయ్ కెరీర్‌లో మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

దీంతో పాటు యువతకు పిలుపునిస్తూ ఇలా అన్నారు. అడ్డంకులను ఛేదించండి, పెద్ద కలలు కనండి. లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంకితభావం, క్రమశిక్షణ గనుక ఉంటే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. మొదటి మ్యాచ్‌లో ప్రదర్శనతో సంబంధం లేకుండా, పట్టుదలతో ముందడుగు వేసిన విజయ్ ప్రయాణం ఎంతో మంది గ్రామీణ ప్రాంత యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తు మ్యాచుల్లో అతను మరింత రాణించాలని తెలుగువారంతా కోరుకుంటున్నారు.