Rishabh Pant: టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. దీంతో రిషబ్ పంత్కు చేదు వార్త వెలవడనున్నట్లు తెలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో అంతగా రాణించడం లేదు. పేలవ ఫామ్ కారణంగా వన్డే జట్టు (ODI) నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 రేసులో వెనుకబడిన పంత్, ఇప్పుడు వన్డేల్లోనూ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుంటూ సంజూ శామ్సన్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్ కీపర్గా కొనసాగుతుండగా, బ్యాకప్ కీపర్ స్థానం కోసం పంత్ కంటే శామ్సన్కే ప్రధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మార్పునకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఐపీఎల్ 2026 ఫామ్. రిషబ్ పంత్ ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు (సగటు 27.14). మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ శామ్సన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 8 మ్యాచ్ల్లోనే 304 పరుగులు చేసి, అందులో రెండు సెంచరీలు బాదడం విశేషం. వన్డే ఫార్మాట్లో సంజూకు తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ, అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. పంత్ గాయపడిన సమయంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శామ్సన్తో పాటు జురెల్ పేరు సైతం రేసులో ఉంది. మరోవైపు.. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అందుకే మెరుగైన గణాంకాలు ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించాలని చూస్తున్నారు.
