రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై వైభవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్న వయసులోనే అతను చూపించిన పట్టుదల, పరిణతి తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని అశ్విన్ అన్నాడు. వైభవ్ ఎదుగుదలను చూసి దిష్టి తగలకుండా అతని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అశ్విన్ సరదాగా వ్యాఖ్యానించాడు.
హైదరాబాద్పై రాజస్థాన్ విజయం సాధించిన తర్వాత అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు. కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే వైభవ్ తన ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నాడని, ఆ మార్పే తనకు బాగా నచ్చిందని చెప్పాడు.
“నేను అతని 15 ఏళ్ల వయసు గురించి పదే పదే మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ, ఇంత చిన్న వయసులోనే అంతటి మానసిక పట్టుదల రావడానికి అతను ఎన్ని మ్యాచ్లు ఆడి ఉంటాడు? సీజన్ ప్రారంభంలో థర్డ్ మ్యాన్ దిశగా వచ్చే బంతులను అతను నేరుగా ఆడటానికి ప్రయత్నించి అవుట్ అయ్యేవాడు. కానీ, అదే బంతిని ఎలిమినేటర్ మ్యాచ్లో ఎంతో చాకచక్యంగా అప్పర్కట్ షాట్తో సిక్సర్గా మలిచాడు. ఒక్క సీజన్ లోనే అతను తన ఆటలో ఇంతటి మార్పులు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం” అని అశ్విన్ కొనియాడాడు.
వైభవ్ ఒక సాధారణ ఆటగాడు కాదని, అతనిపై ఎవరి కళ్లూ పడకుండా తల్లిదండ్రులు దిష్టి తీయాలని అశ్విన్ నవ్వుతూ అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ మాట్లాడిన తీరును కూడా అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. “సెంచరీలు ఎప్పుడైనా వస్తాయి, ఈ రోజు జట్టును గెలిపించడమే నా లక్ష్యం అని వైభవ్ చెప్పడం అతని పరిణతికి నిదర్శనం. అతను ఆడే విధానం చూస్తే సెంచరీల గురించి అస్సలు ఆలోచించనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో అతను ఎన్నో సెంచరీలు సాధిస్తాడని అతనికి తెలుసు” అని అశ్విన్ పేర్కొన్నాడు. పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనే ప్రశ్నకు సమాధానంగా, వైభవ్ అద్భుతమైన ఆటతీరుతో అందరి నోళ్లు మూయించాడని అశ్విన్ స్పష్టం చేశాడు.
