Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దిగ్గజ బౌలర్లను చితకబాదుతూ భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. వైభవ్ క్రీజులో ఉంటే బాల్, బౌలర్ వణకాల్సిందే. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ గ్రౌండ్ ను హోరెత్తిస్తున్న వైభవ్ ఆటతీరుకి క్రికెట్ వరల్డ్ ఫిదా అయిపోయింది. వైభవ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 10 మ్యాచ్‌లలో 404 పరుగులు సాధించాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ఉంది.

2024 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ బ్యాటింగ్ చూసిన తర్వాతే రాజస్థాన్ తనని తీసుకోవాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్, జుబిన్ భరూచా, వైభవ్ గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. జట్టు ట్రయల్ క్యాంప్ మొదటి రోజే వైభవ్ చూపిన ప్రభావం ఎంతగా ఉందంటే, ఫ్రాంచైజీ తమ వేలం వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చిందని వివరించారు.

విస్డెన్ క్రికెట్‌తో మాట్లాడుతూ, నెట్స్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టి వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడని భరూచా వెల్లడించారు. “నేను సంజు సామ్సన్, యశస్వి జైస్వాల్ వంటి ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను దగ్గరగా గమనించాను. సంజు తొలి బంతికే సిక్స్ కొట్టాడు, యశస్వి బంతిని తన భుజం మీదుగా ఫ్లిక్ చేశాడు, కానీ వైభవ్ చేసింది వేరే స్థాయిలో ఉంది,” అని ఆయన అన్నారు. ట్రయల్స్ సమయంలో, వైభవ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ వేసిన ఇన్‌స్వింగింగ్ బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. దీని తర్వాత, ఆ ఆటగాడిని మరింత కఠినమైన పరీక్షకు గురిచేయాలని నిర్ణయించారు. ఆటగాళ్లందరినీ పంపించివేసిన తర్వాత, వైభవ్‌ను తిరిగి పిలిపించి, పొడగరి, ఫాస్టెస్ట్ త్రోడౌన్ స్పెషలిస్టులతో వైభవ్ కి పరీక్ష పెట్టారు.

“తన పూర్తి శక్తితో బౌలింగ్ చేయమని నేను బౌలర్ కి చెప్పాను. వైభవ్ ఆరంభంలో కొన్ని బంతులను వదిలేసి, ఆ తర్వాతి బంతిని నేరుగా సైట్‌స్క్రీన్‌పైకి పంపాడు. ఆ క్షణంలోనే ఇతను సాధారణ ఆటగాడు కాదని నేను గ్రహించాను,” అని భరూచా అన్నారు. భరూచా వెంటనే రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జాక్ లష్ మెక్‌క్రమ్‌కు ఒక మెసేజ్ పంపారు. “మనకు తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే ఆటగాడు ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అతనిలాంటి బ్యాట్స్‌మన్‌ను నేను చూడలేదు.” సచిన్ టెండూల్కర్ తర్వాత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు వైభవే మాత్రమే అని మేసేజ్ లో పేర్కొన్నట్లు తెలిపాడు.