Eric Simons: ఐపీఎల్లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడూ ఒక పెద్ద సస్పెన్సే. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే విషయాన్ని కేవలం అతను మాత్రమే నిర్ణయించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశాడు. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సిమన్స్ ఈ విషయాలను పంచుకున్నారు. 44 ఏళ్ల ధోని కాలిక గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడని, అయినప్పటికీ నెట్స్లో మాత్రం బంతిని అద్భుతంగా బాదుతున్నాడని సిమన్స్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ధోని పునరాగమనంపై సీఎస్కే ఆశగా ఉందా అని అడిగిన ప్రశ్నకు.. “మీరు నిజంగానే నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారా? మేము ఎప్పుడూ ఆ ఆశతోనే ఉంటాం” అని సిమన్స్ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఈ సీజన్లో ధోనికి ఉన్న కాలిక గాయం కారణంగా కనీసం పరిగెత్తడం సైతం చాలా కష్టంగా మారిందని, అందుకే అతను బరిలోకి దిగలేకపోయాడని సిమన్స్ తెలిపాడు. కానీ, నెట్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం తాను గతంలో ఎప్పుడూ చూడనంత అద్భుతంగా, పవర్ఫుల్గా ధోని బంతిని బాదుతున్నాడని ఈ మాజీ సౌతాఫ్రికా ఆల్రౌండర్ ప్రశంసించారు. ఫిట్నెస్ సమస్యల వల్ల 2026 సీజన్కు పూర్తిగా దూరమైనప్పటికీ, ధోనిలో ఇంకా ఆ పాత పవర్ అలాగే ఉందనే వార్త సీఎస్కే అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అయితే, జట్టుకు తాను వంద శాతం న్యాయం చేయగలనని నమ్మితేనే ధోని మైదానంలోకి అడుగుపెడతాడని సిమన్స్ స్పష్టం చేశారు. ధోని తీసుకునే ఏ నిర్ణయమైనా భావోద్వేగాలతోనో, వ్యక్తిగత రికార్డుల కోసమో ఉండదని సిమన్స్ చెప్పుకొచ్చారు. తాను ఆడలేనని అనిపిస్తే ధోని ఖచ్చితంగా ఆడడని, ఒకవేళ అంతా బాగుంది అనుకుంటేనే బరిలోకి దిగుతాడని అన్నారు. ధోని ఎప్పుడూ తన స్వార్థం చూసుకోడని, జట్టు ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాడని వివరించారు. ఈ సీజన్లో మ్యాచ్లు ఆడకపోయినప్పటికీ, ధోని జట్టుతోనే ఉంటూ కుర్రాళ్లకు మెంటార్గా వ్యవహరించాడని, అతని అనుభవం, ప్రశాంతత జట్టుకు ఎంతో ప్లస్ అయ్యాయని సిమన్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసి, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సీఎస్కేకు ఈ సీజన్లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది.
