‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’

Rr Fieldingssss

Rr Fieldingssss

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలపై భారత మాజీ బ్యాటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులతో మరోసారి చెలరేగాడు. అయితే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో అదరగొట్టడంతో ఈ భారీ స్కోరు కూడా సరిపోలేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరిగి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 35 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

×
×
Ad

జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంజ్రేకర్ తప్పుబట్టారు. గాయపడిన జడేజాను మళ్లీ బ్యాటింగ్‌కు పంపడం, అలాగే విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరా కంటే ముందు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ప్రమోట్ చేయడం పెద్ద పొరపాటని విమర్శించారు. 8వ స్థానంలో బరిలోకి దిగిన ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. “రిటైర్డ్ హర్ట్ అయిన జడేజాను మళ్లీ లోపలికి పంపడం, ఫెరీరా కంటే ముందు ఆర్చర్‌ను బ్యాటింగ్‌కు దించడం రాజస్థాన్ చేసిన అత్యంత చెత్త నిర్ణయాలు. వీటిని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను.. మీరు బుద్దిలేకుండా ఆ నిర్ణయాలు తీసుకున్నారు” అని మంజ్రేకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.

మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తాము చేసిన స్కోరు డిఫెండ్ చేసుకోవడానికి సరిపోయేదేనని, అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించిందని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ క్వాలిఫయర్ వరకు రావడం పెద్ద సానుకూలాంశమని, భవిష్యత్తులో ఈ అనుభవంతో వారు మరింత మెరుగవుతారని పరాగ్ పేర్కొన్నాడు.