ఐపీఎల్ 2026 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ ఊరట లభించింది. గాయం కారణంగా గత నెల రోజులుగా జట్టుకు దూరమైన ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ మళ్లీ భారత్కు వస్తున్నాడు. ఈ వారం చివర్లో ఆయన జట్టుతో కలవనున్నాడని సమాచారం. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో బౌండరీని ఆపే ప్రయత్నంలో సాల్ట్ ఎడమచేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో తదుపరి చికిత్స, కోలుకోవడం కోసం ఆయన స్వదేశానికి వెళ్ళాడు.
ఈ సీజన్లో గాయపడటానికి ముందు ఫిల్ సాల్ట్ ఆరు మ్యాచ్ల్లో 168.33 స్ట్రైక్ రేట్తో 202 పరుగులు చేశాడు. ఇందులో రెండు మెరుపు అర్ధసెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీతో కలిసి పవర్ప్లేలో జట్టుకు అదిరిపోయే ఆరంభాలు ఇచ్చిన సాల్ట్ తిరిగి రావడం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్కు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. సాల్ట్ లేని సమయంలో ఓపెనర్గా వచ్చిన జాకబ్ బెథెల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో సాల్ట్ రాక కోసం మేనేజ్మెంట్ ఎంతగానో ఎదురుచూస్తోంది. చివరి లీగ్ అయిపోయిన తర్వాత ఆడే నాకౌట్ మ్యాచ్ లకు సాల్ట్ అందుబాటులో ఉండటం అనేది ఆర్సీబీకి ఎంతో కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు.
మే 22న ఉప్పల్లో అసలైన సమరం!
మరోవైపు లీగ్ స్టేజ్లో భాగంగా మే 22న (శుక్రవారం) హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్సీబీ, క్వాలిఫయర్-1 లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీని అడ్డుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని పిచ్ కండిషన్స్, ఆర్సీబీ బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఆయనకు విశ్రాంతినిస్తే కోహ్లీ, రజత్ పటిదార్, వెంకటేష్ అయ్యర్లతో కూడిన ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ బౌలర్లు సరికొత్త ప్లాన్స్తో సిద్ధమవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో హోరాహోరీగా సాగే ఈ పోరులో గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని హోమ్ టీమ్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
