ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ బౌలర్లు అవలంబించిన ‘బాడీలైన్ బౌలింగ్’ (ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు వేయడం) వ్యూహంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ స్టార్ ఫాస్ట్ బౌలర్లు కాగిసో రబడా, మహమ్మద్ సిరాజ్ వేసిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొంటూ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. 204.26 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ సమయంలో అతడిని కట్టడి చేయడానికి గుజరాత్ బౌలర్లు వరుసగా బాడీలైన్ బౌన్సర్లతో టార్గెట్ చేశారు. అయితే వైభవ్ మునుపటి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు అనేది మాత్రం వాస్తవం. గుజరాత్ పై అంత దూకుడుగా ఆడలేకపోయాడు.
దీనిపై ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “15 ఏళ్ల చిన్న పిల్లాడైన వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికి అంతలా బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అతడు పెద్ద ఆటగాళ్లతో పోటీపడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి మనసు మాత్రం దీనిని అంగీకరించలేకపోతోంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో వైభవ్ అద్భుతంగా ఆడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్కు విజయం దక్కలేదు. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 104 పరుగులతో సెంచరీతో చెలరేగడం, సాయి సుదర్శన్ (58) రాణించడంతో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ ఐదేళ్లలో మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్లో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
