IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. మంత్రుల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్‌ఆర్‌హెచ్?

  • టికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్న సామాన్య అభిమానులు
  • ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లకు విపరీతంగా టికెట్ల డిమాండ్
  • బాక్స్ టికెట్ ధర రూ.10 లక్షలు
  • భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్‌ఆర్‌హెచ్
Srh Vs Rcb Black Tickets

Srh Vs Rcb Black Tickets

SRH vs RCB Match Black Tickets: ఐపీఎల్ 2026 సీజన్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు టికెట్ల కోసం సామాన్య అభిమానులు పడుతున్న ఇబ్బందులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణ క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకకపోవడం, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్‌లకు టికెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా వెయ్యి రూపాయల టికెట్ బ్లాక్ మార్కెట్‌లో ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు అమ్ముడవుతోందని సమాచారం. అయినా కూడా టికెట్లు దొరకడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ బాక్స్ టికెట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్కో బాక్స్ టికెట్ లక్ష రూపాయల వరకు వెళ్తుండగా.. పూర్తి కార్పొరేట్ బాక్స్ ధర రూ.10 లక్షలకు చేరిందని తెలుస్తోంది. అది కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉంటేనే లభిస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా లాబీయింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రుల రిఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదని సమాచారం.

హై ఓల్టేజ్ మ్యాచ్‌లను ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం భారీగా క్యాష్ చేసుకుంటోందని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ ధరలు పెంచడమే కాకుండా.. అదనంగా భారీ బుకింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ టికెట్ గందరగోళంలో సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగారు. అసలు టికెట్ బుకింగ్ యాప్‌లను పోలి ఉండే ఫేక్ ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసి అభిమానులను మోసం చేస్తున్నారు. ఆ నకిలీ యాప్‌లో సులభంగా టికెట్లు బుక్ అవుతున్నట్లు కనిపించడంతో వేలాది మంది అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేశారు. తర్వాత ఆ యాప్ నకిలీదని పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే వేలాది టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఇక స్టేడియం సిబ్బంది మాత్రం ఆ ఫేక్ టికెట్లతో మ్యాచ్‌కు అనుమతించబోమని స్పష్టం చేయడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. తాము కొనుగోలు చేసిన టికెట్ అసలుదా? నకిలీదా? అనే అయోమయంలో ఇప్పుడు వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఘటనతో ఐపీఎల్ టికెట్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ అభిమానులకు టికెట్లు అందుబాటులో లేకపోవడం, బ్లాక్ మార్కెట్ దందా పెరగడం, సైబర్ మోసాలు జరగడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.