ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్ మ్యాచ్లు ధర్మశాల, చండీగఢ్లలో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం.. ఫైనల్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వేదికను అహ్మదాబాద్కు మార్చారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికగా బెంగళూరును కాదని అహ్మదాబాద్ను ఎంపిక చేయడం వెనుక ఉన్న అసలు కారణాలను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో వివాదాలు, స్టేడియం సామర్థ్యం వంటి అంశాలే ఇందుకు కారణమని బోర్డు తెలిపింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య రాష్ట్ర క్రికెట్ సంఘానికి స్టేడియం మొత్తం సామర్థ్యంలో కేవలం 15 శాతం టికెట్లను మాత్రమే ఉచితంగా (కాంప్లిమెంటరీ) కేటాయిస్తారు. అయితే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) భారీ మొత్తంలో టికెట్స్ అడిగిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ‘లీగ్ మ్యాచ్ల సమయంలోనే కేఎస్సీఏ నిర్ణీత కోటా కంటే ఎక్కువ టికెట్లు డిమాండ్ చేసింది. దీనిపై వివరణ కోరుతూ బీసీసీఐ పంపిన ఈమెయిల్కు కేఎస్సీఏ బదులిచ్చింది. తమ సభ్యులు, అనుబంధ క్లబ్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా భారీగా ఉచిత టికెట్లు కావాలని కేఎస్సీఏ తెలిపింది. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వానికి మరో 700 టికెట్లు అదనంగా ఇవ్వాలని పట్టుబట్టింది. నిబంధనల కంటే దాదాపు 10,000 టికెట్లు అదనంగా అడగడం బీసీసీఐని షాక్కు గురిచేసింది. ఈ మొండి వైఖరి వల్లే బెంగళూరు రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అని దేవజిత్ సైకియా వివరించారు.
గత ఏడాది విజేత జట్టు హోమ్ గ్రౌండ్లో ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ.. ఈసారి ఆ ఛాన్స్ బెంగళూరుకు దక్కలేదు. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ స్పందిస్తూ.. ఫైనల్ వేదిక మారడానికి స్టేడియం సామర్థ్యం కూడా కీలక పాత్ర పోషించిందని వివరించారు. ‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం కేవలం 40,000 మాత్రమే. కానీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ 1.30 లక్షల మంది కూర్చునే వసతి ఉంది. ఫైనల్ సమయంలో ఐసీసీ సమావేశం జరగనుంది. విదేశీ ప్రతినిధులు, ప్రముఖులకు తగినన్ని టికెట్లు, సౌకర్యాలు కల్పించాలంటే అహ్మదాబాద్ సరైన వేదిక అని బోర్డు భావించింది. ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వస్తారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద స్టేడియం వైపు మొగ్గు చూపాం’ అని అరుణ్ ధూమల్ చెప్పారు.
