RCB vs GT Pace Bowling Battle Worth RS 68.75 Crore: ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం బ్యాటర్ల హవా కొనసాగినా.. ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని మాత్రం రెండు జట్ల పేస్ బౌలింగ్ దళాలే నిర్ణయించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2026 ఫైనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం రెండు జట్ల పేస్ బౌలింగ్ యూనిట్ల మధ్య జరిగే పోరు. మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు), కగిసో రబాడా (రూ.10.75 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.9.5 కోట్లు)తో గుజరాత్ టైటాన్స్ బలమైన పేస్ దాడిని కలిగి ఉంది. వీరితో పాటు ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు), జోష్ హేజిల్వుడ్ (రూ.12.5 కోట్లు) జట్టుకు బలంగా నిలిచారు. యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ (రూ.6 కోట్లు) ఈ సీజన్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ కీలక పేసర్ల మొత్తం విలువ రూ.68.75 కోట్లకు చేరడం విశేషం.
ఫైనల్లో మరో ఆసక్తికర అంశం పర్పుల్ క్యాప్ రేసు. ప్రస్తుతం 28 వికెట్లతో కగిసో రబాడా అగ్రస్థానంలో ఉండగా.. 26 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 18 వికెట్లు, జేసన్ హోల్డర్ 17 వికెట్లతో టాప్ బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నారు. రసిఖ్ సలామ్ 16 వికెట్లతో బ్రేక్త్రూ సీజన్ను నమోదు చేశాడు. హేజిల్వుడ్ గణాంకాల పరంగా టాప్ వికెట్ టేకర్లలో లేకపోయినా.. పవర్ప్లే, డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీస్తూ ఆర్సీబీ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు.
ఆర్సీబీ-జీటీ జట్లు క్వాలిఫయర్-1లో తలపడినప్పుడు బెంగళూరు పేస్ దళమే మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. జేకబ్ డఫీ మూడు వికెట్లు తీసి హీరోగా నిలవగా.. భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆ మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. ఫైనల్కు ముందు న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో పవర్ప్లేలో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో.. ఆ జట్టే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
బ్యాటర్ల ఆధిపత్యం కనిపించిన ఐపీఎల్ 2026 సీజన్లో కూడా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ విజయాలకు ప్రధాన కారణం వారి పేస్ బౌలింగ్ దళాలే. అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు కొంత సహకారం అందించే అవకాశం ఉండటంతో.. భువనేశ్వర్, హేజిల్వుడ్, రబాడా, సిరాజ్ల ప్రదర్శన ఫైనల్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. పేస్ బౌలర్ల పోరుకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐపీఎల్ 2026 ట్రోఫీని ఎవరు గెలుస్తారో నిర్ణయించడంలో ఈ రూ.68.75 కోట్ల పేస్ వార్ కీలక పాత్ర పోషించనుంది.
