IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?

  • వరుసగా నమోదవుతున్న భారీ స్కోర్లు
  • 38 మ్యాచ్‌లలో 200కి పైగా స్కోర్లు
  • పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం
  • బౌలర్ల పరిస్థితి మరీ దారుణం
Ipl 2026 Centuries

Ipl 2026 Centuries

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భారీ స్కోర్లు వరుసగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం 62 మ్యాచ్‌లు పూర్తికాగా.. వాటిలో 38 మ్యాచ్‌లలో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతేకాదు భారీ లక్ష్యాలను కూడా జట్లు చాలా ఈజీగా ఛేదిస్తున్నాయి. కేవలం 24 మ్యాచ్‌ల్లో మాత్రమే స్కోర్లు 170-180 మధ్యలో ఆగాయి. ఈ గణాంకాలే.. ప్రస్తుత ఐపీఎల్‌లో భారత పిచ్‌లు ఎంతలా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయో స్పష్టంగా చెబుతున్నాయి.

ఐపీఎల్ 2026లో దాదాపుగా అన్ని మైదానాల్లో బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించడం లేదు. పిచ్‌ల నుంచి స్వింగ్ లేదు, సీమర్లకు మూవ్‌మెంట్ లేదు, స్పిన్నర్లకు గ్రిప్ లేదు. దీంతో బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. దాంతో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు ఏకపక్షంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జట్ల బ్యాటర్లు.. బౌలర్లను నెట్ ప్రాక్టీస్‌లో బాదినట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆడిన తీరు కూడా ఈ చర్చకు కారణమైంది.

ఐపీఎల్ 2026లో బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి పూర్తిగా బౌలర్లనే బాధ్యులను చేయడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్‌లలో బౌలర్లకు కనీస సహకారం లేకపోవడంతో వారు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నారు. ఈ సీజన్‌లో అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన మ్యాచ్‌లు 170-180 స్కోర్లవే. ఆ మ్యాచ్‌ల్లోనే బ్యాట్, బాల్ మధ్య అసలైన సమరం కనిపించింది. ఒత్తిడి, వ్యూహాలు, క్లోజ్ ఫినిష్‌లు.. ఇలా టీ20 క్రికెట్‌కు కావాల్సిన అసలైన థ్రిల్ ఈ మ్యాచ్‌ల్లోనే కనిపించిందని అభిమానులు చెబుతున్నారు. కానీ ప్రతి మ్యాచ్ కూడా 220-230 పరుగుల పండుగగా మారిపోతే.. బౌలర్ల ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

టీ20 క్రికెట్ అసలు మజా బ్యాటర్లు మాత్రమే ఆధిపత్యం చెలాయించినప్పుడు కాదు.. బౌలర్లు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగినప్పుడు వస్తుందని అభిమానులు అంటున్నారు. బ్యాట్, బాల్ మధ్య మంచి సమరం ఉన్నప్పుడే మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారతాయి. ఒకప్పుడు 120-150 పరుగులను కూడా పలు టీమ్స్ కాపాడుకున్నాయని ఫాన్స్ గుర్తుచేస్తున్నారు. అప్పట్లో 180-200 స్కోర్ ఉంటే విజయంపై ధీమా ఉండేదని చెబుతున్నారు. ఐపీఎల్ నిర్వాహకులు, పిచ్ క్యూరేటర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుతున్నారు.