Netizens Slams Murali Kartik Over Controversial Comments on Yash Dayal: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తిక్ వ్యాఖ్యలకు బెంగళూరు ఫ్రాంచైజీ కౌంటర్ వేసింది.
ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ బౌలింగ్ చేస్తుండగా.. కామెంటేటర్ మురళీ కార్తిక్ మాట్లాడాడు. ‘మనం ఎప్పుడూ చెప్పినట్లే ఒకరికి పనికిరానిది (ట్రాష్) మరొకరికి విలువైన నిధిగా మారుతుంది’ అని అన్నాడు. కార్తిక్ చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ అంశంపై బెంగళూరు ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘అవును.. ఇతడు మా విలువైన నిధి’ అని పేర్కొంది. అంతేకాదు ఓ లవ్ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: CSK vs GT Dream11 Prediction: చెన్నై, గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు యశ్ దయాల్ ఆడాడు. ఆ సీజన్లో కోల్కతా బ్యాటర్ రింకూ సింగ్.. యశ్ దయాల్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్స్లు బాదాడు. దీంతో దయాల్ను గుజరాత్ పక్కనబెట్టింది. 2023 సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన దయాల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అయినా కూడా 2024 వేలంలో ఆర్సీబీ దయాల్ను ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆర్సీబీ నమ్మకాన్ని దయాల్ తాజా సీజన్లో నిలబెట్టాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు.