Brian Lara Predicts RCB vs CSK Match in Chinnaswamy: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. నేడు ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా.. అందరి కళ్లూ శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు, చెన్నై మ్యాచ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూడు టీమ్లు కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన వేళ.. నాలుగో బెర్తును దక్కించుకునేది ఎవరో ఆ రోజు తేలిపోనుంది. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఆర్సీబీదే అని జోస్యం చెప్పాడు.
బ్రియాన్ లారా మాట్లాడుతూ… ‘గత ఐదు మ్యాచ్లలో ఆర్సీబీ గెలిచింది. సీఎస్కేపై కూడా అదే స్థాయిలో ఆడనుంది. నా అంచనా ప్రకారం సీఎస్కేపై ఆర్సీబీ గెలుస్తుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రెండో సగంలో ఇతర ఆటగాళ్లూ రాణిస్తుండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ సాధించలేదు. అందుకే ఆర్సీబీ చాలా ఆకలితో ఉంది. సీఎస్కే మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కు ఆర్సీబీ వెళుతుంది. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోదు. ఫాఫ్ డుప్లెసిస్, మొహ్మద్ సిరాజ్ ఫామ్లోకి వచ్చారు. అయితే సీఎస్కేను తక్కువగా అంచనా వేయొద్దు. అక్కడ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నాడు.
Also Read: Aishwarya Rai Cannes Look: కేన్స్లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫొటోస్ వైరల్!
శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కేలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. సీఎస్కే ప్లేఆఫ్స్కు దూసుకెళుతుంది. మ్యాచ్ రద్దైతే చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఆర్సీబీ 13 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్కు వరణుడు అడ్డుపడకూడదని ఆర్సీబీ ఫాన్స్ కోరుకుంటున్నారు.