Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి
  • ఓటమిపై అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు
  • వచ్చే ఏడాది చూసుకుంటాం అంటున్న అక్షర్
Axar Patel Comments

Axar Patel Comments

ఐపీఎల్‌ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) 8 వికెట్ల తేడాతో ఓడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి డీసీ 20 ఓవర్లలో 142 పరుగులే చేసింది. పాతుమ్ నిశాంక (50; 29 బంతుల్లో 5×4, 3×6), అశుతోష్‌ శర్మ (39; 28 బంతుల్లో 3×4, 3×6) మినహా మిగతా ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్‌పై తాము చేసిన పరుగులు సరిపోవని అంగీకరించిన అక్షర్.. స్పిన్నర్లు కొన్ని కీలక తప్పిదాలు చేశారని తెలిపాడు. ఇంకా ఢిల్లీ ప్రయాణం ముగియలేదని, వచ్చే ఏడాది కూడా ఉందంటూ అక్షర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు అందుకుంది. మిగతా 4 మ్యాచ్‌లలో గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.

‘ఈ పిచ్‌పై మేము చేసిన పరుగులు సరిపోలేదు. అదే సమయంలో మా స్పిన్నర్లు కూడా కొన్ని తప్పులు చేశారు. పిచ్ ఎలా ప్రవర్తించిందో చూస్తే.. స్పిన్నర్ల నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయని అనిపించింది. కానీ మరోవైపు చూస్తే.. రెండు మూడు ఓవర్లలోనే మేము ఐదు వికెట్లు కోల్పోయాం. అక్కడే మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా మా చేతుల నుంచి జారిపోయింది. ఈ విషయంపై మేము ఆలోచించాలి. ఎందుకంటే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలానే జరిగింది. మేము మంచి ఆరంభం చేసినా.. ఒక్కసారిగా వరుస వికెట్లు పడిపోతున్నాయి. వరుసగా వికెట్స్ కోల్పోవడమే మా ఓటమికి కారణం అవుతోంది’ అని అక్షర్ పటేల్ చెప్పాడు.

‘ఓటములపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను, అశుతోష్‌ శర్మ బ్యాటింగ్ మాట్లాడుకున్నాం. మేము తప్పు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్‌కు చాలా కష్టంగా మారుతుందని చెప్పుకున్నాం. కాబట్టి సరైన మైండ్‌సెట్‌ను అమలు చేయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకటి లేదా రెండు వికెట్లు పడినా.. క్రీజులో కొంతసేపు నిలబడి ఆడొచ్చు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఒకటి రెండు ఓవర్లు ఒత్తిడిని తట్టుకుని ఆడటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము చేసిన తప్పుల గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. వచ్చే ఏడాది కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చిస్తాం. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లను కూడా పరీక్షించాలి. ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, జట్టులో ఎలాంటి మార్పులు చేయాలి అన్న విషయాలను నిర్ణయిస్తాం’ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.