Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లో వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉన్న ఇండియా ‘ఎ’ జట్టు బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తిలక్ వర్మ సారథ్యంలోని జట్టుకు ఇది చావో రేవో తేల్చే పోరుగా మారింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్ప మరో మార్గం లేదు. ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు రెండు సార్లు ప్రత్యర్థులతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం శ్రీలంక ‘ఎ’ మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇండియా ‘ఎ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’లకు చెరో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో భారత జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌పై గెలవకపోతే ఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇండియా ‘ఎ’ జట్టు ఇప్పటివరకు ప్రదర్శించిన ఆట నిరాశపరిచింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 349 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ డక్‌వర్త్ లూయిస్ విధానంలో నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అనంతరం శ్రీలంక ‘ఎ’తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సూపర్ ఓవర్ వరకు వెళ్లి పరాజయం పాలైంది.

×
×
Ad

శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్ అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూపర్ ఓవర్‌లో భారత జట్టు 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన వాగ్వాదం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతనికి లభించింది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీలో 14, 44, 21 పరుగులు చేసినప్పటికీ వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. మరోవైపు జట్టు వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో కలిపి 204 పరుగులు చేసి జట్టు ప్రధాన బలంగా నిలిచాడు.

కెప్టెన్ తిలక్ వర్మ కూడా రెండు అర్ధ సెంచరీలతో 149 పరుగులు చేశాడు. సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విప్రజ్ నిగమ్ కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించారు. అయితే జట్టు బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని తలా నాలుగు వికెట్లు సాధించినప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో గాయపడిన యుధ్వీర్ సింగ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను జట్టులోకి తీసుకొచ్చారు.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టు కూడా నిలకడైన ప్రదర్శన చేయలేకపోయింది. భారత్‌పై డీఎల్‌ఎస్ పద్ధతిలో గెలిచిన ఆ జట్టు, శ్రీలంక ‘ఎ’ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల దృష్టి నెలకొంది. ఫైనల్ రేసులో నిలవాలంటే తిలక్ వర్మ అండ్ కో. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.