ICC Ultimatum to Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్లలో పాల్గొనాలా? లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా? అనే విషయంపై జనవరి 21 చివరి తేదీగా నిర్ణయిస్తూ ఐసీసీ స్పష్టత ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. భారత్కు బదులుగా శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా పరిగణించాలని బీసీబీ కోరుతోంది. అయితే, ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్కే కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
Read Also: Vijay: మరోసారి సీబీఐ ముందు హాజరైన విజయ్.. ఎన్నికల వేళ ఏం జరుగుతోంది?
తాజాగా, శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధులు రెండోసారి బీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచకప్ను సహ-ఆతిథ్యం ఇవ్వాలన్న తన కోరికను మరోసారి వెల్లడించినప్పటికీ, భారత్లో మ్యాచ్లు ఆడేందుకు అంగీకరించలేదు. భద్రతా సమస్యల పేరుతో శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా ప్రతిపాదించింది. కానీ, గ్రూప్-సీ లో భాగంగా బంగ్లాదేశ్ ముంబై, కోల్కతాల్లో మ్యాచ్లు ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. గత మూడు వారాలుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించడంతో.. ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత భారత్లో ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు ఇష్టపడటం లేదని, తమ డిమాండ్లు నెరవేరకపోతే టోర్నీ నుంచి వైదొలగే అవకాశం ఉందని బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసింది. ఈ అంశం తొలిసారి జనవరి 4న వెలుగులోకి వచ్చింది.
ఇక, ఐర్లాండ్తో తమ గ్రూప్ మార్పు డిమాండ్ను కూడా ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. ఐర్లాండ్ మ్యాచ్లు పూర్తిగా శ్రీలంకలోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ బీసీబీకి హామీ ఇచ్చింది. జనవరి 21 వరకు బీసీబీ నిర్ణయాన్ని ఐసీసీ ఎదురుచూస్తోంది. ఆలోపు బంగ్లాదేశ్ టోర్నీలో పాల్గొనకపోతే, ప్రస్తుత ICC ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రత్యామ్నాయ జట్టును ప్రపంచకప్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ స్థానానికి స్కాట్లాండ్ బలమైన పోటీదారుగా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం కాకపోతే పాకిస్తాన్ కూడా తన భాగస్వామ్యాన్ని పునఃసమీక్షించవచ్చని జియో న్యూస్ గతంలో నివేదించింది. భద్రతా అంశాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్ను సంప్రదించగా, పాకిస్తాన్ పూర్తి మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక అందుబాటులో లేకపోతే బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి తెలియజేసినట్లు సమాచారం.
