India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు కల్పించడాన్ని మాజీ భారత బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ ప్రశ్నించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. కోచింగ్ వ్యవస్థపై పరోక్షంగా విమర్శలు చేశారు.
‘కోచ్ ఫేవరెట్’ అంటూ వాషింగ్టన్పై వ్యాఖ్యలు
వాషింగ్టన్ సుందర్కు జట్టు యాజమాన్యం నుంచి లభిస్తున్న నిరంతర మద్దతును బద్రీనాథ్ ప్రశ్నించారు. అతను ‘కోచ్ ఫేవరెట్’గా మరోసారి జట్టులోకి వచ్చినట్లు కనిపిస్తోందని తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించారు. ఇంతకాలం లభించిన నమ్మకాన్ని సుందర్ ఈసారి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక, నితీష్ కుమార్ రెడ్డి ఎంపికపైనా బద్రీనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అతని బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించారు. నితీష్ను ప్రధానంగా బ్యాటర్గా మాత్రమే చూస్తానని, అతడిని పూర్తిస్థాయి ఆల్రౌండర్గా భావించలేనని అన్నారు. ఆల్రౌండర్గా గుర్తింపు పొందాలంటే బంతితోనూ ప్రభావం చూపడం ముఖ్యమని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు.
బుమ్రా పునరాగమనం సానుకూలం
వాషింగ్టన్, నితీష్ ఎంపికపై విమర్శలు చేసినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడాన్ని బద్రీనాథ్ స్వాగతించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో బుమ్రా ఆడటం BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఇక, బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్నెస్ కూడా కీలకంగా మారింది. వీరి లభ్యతకు ఫిట్నెస్ క్లియరెన్స్ అవసరమని సమాచారం. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ముందు జట్టు కూర్పుపై మరింత ఆసక్తి నెలకొంది.
ఆసియా క్రీడలకు సన్నాహకంగా సిరీస్
ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ భారత్కు ఆసియా క్రీడల సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నెల చివర్లో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ తన స్వర్ణ పతకాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను పరీక్షించేందుకు, జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కాగా, భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరగనుంది. సిరీస్ ప్రారంభానికి ముందే వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఎంపికపై చర్చ మొదలవడంతో.. బద్రీనాథ్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

